గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (13:16 IST)

బెంగళూరులో అల్లర్లు.. ముగ్గురు మృతి.. యడ్యూరప్ప సీరియస్.. అసలేం జరిగింది?

Bengaluru Violence
బెంగళూరులో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులో అల్లర్లకు పాల్పడిన వారిని చెదరగొట్టడానికి పోలీసులు నిర్వహించిన కాల్పుల్లో మొదట ఇద్దరు మరణించగా... నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై సీఎం యడ్యూరప్ప సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
 
శాంతియుత వాతావరణం కల్పించడానికి అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా దాడులు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని యడ్డీ చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు.
 
కర్నాటకకు చెందిన అమీర్-ఈ-షరియత్ హజ్రత్ మౌలనా సంఘీర్ అహ్మెద్ కూడా ముస్లిం సోదరులు సంయమనం పాటించాలని, తప్పు చేసినవారిని శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారని విజ్ఞప్తి చేసారు. "దయచేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి. ప్రభుత్వం సరైన చర్య తీసుకుంటుంది" అని అన్నారు. ప్రజలందరూ సంయనం పాటించాలని ఆయన కోరారు. కాగా.. ఈ ఘటనకు అసలు కారకుడైన నవీన్ అనే వ్యక్తిని కేజీ హళ్లి పోలీసులు అరెస్టు చేశారు.
 
కాగా... బెంగళూరులో మంగళవారం అర్థరాత్రి ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన ఒక వ్యాఖ్యతో ఆందోళన చేపట్టిన నిరసనకారులు విధ్వంసానికి దిగారు. ఈశాన్య బెంగళూరులోని రెండు పోలీసు స్టేషన్ల మీద దాడి చేశారు. ఒక ఎమెల్యే ఇంటి పైనా దాడి చేశారు. దాడులను ఆపటానికి పోలీసులు కాల్పులు జరపటంతో ముగ్గురు చనిపోయారని సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కమల్‌పంత్ తెలిపారు. 
 
పోలీసులు 110 మందిని అరెస్ట్ చేశారు. వెంటనే రెండు పోలీస్ స్టేషన్ పరిథుల్లోనూ కర్ఫ్యూ విధించారు. బెంగళూరు నగరంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులోకి తెచ్చామని కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయన్నారు.
 
అసలు ఏం జరిగిందంటే?
పులికేసినగర్ ఎంఎల్ఏ అఖండ శ్రీనివాసమూర్తి (కాంగ్రెస్) బంధువు ఒకరు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు మతవిశ్వాసాలను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ కొంతమంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆ వ్యాఖ్య మీద ఫిర్యాదు చేయటానికి ఒక గుంపు పోలీస్ స్టేషన్‌ దగ్గరికి, మరో గుంపు ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి ప్రదర్శనగా బయలుదేరాయి. తమ ఫిర్యాదును నమోదు చేసుకుని.. తమ మత విశ్వాసాలను దెబ్బతీసినందుకు ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేయాలని ఒక వర్గం పట్టుపట్టింది. ఈ ఆందోళన త్వరగా హింసాత్మకంగా మారిందని, నిరసనకారులు పోలీస్ స్టేషన్ వెలుపల ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారని చెప్తున్నారు.