1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2016 (10:28 IST)

నల్లధన కుబేరులకు మరో ఛాన్స్.. లెక్కల్లో లేని డబ్బుపై 60 శాతం పన్ను!

నల్లధన కుబేరులకు మరో అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్న లెక్కల్లోలేని డబ్బుపై 60 శాతం ఆదాయపు పన్ను విధించాలని కేంద్రం య

నల్లధన కుబేరులకు మరో అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్న లెక్కల్లోలేని డబ్బుపై 60 శాతం ఆదాయపు పన్ను విధించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నోట్లరద్దు తర్వాతి పరిణామాలపై చర్చించారు. 
 
ప్రధానంగా, జన్‌ధన్ అకౌంట్లలో రూ.21 వేల కోట్లకు పైగా డబ్బులు చేరినట్లు వెల్లడైన నేపథ్యంలో అత్యవసరంగా జరిగిన ఈ భేటీ ఆసక్తిగా మారింది. కేబినెట్ భేటీ సమావేశం వివరాలను వెల్లడించనప్పటికీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం లెక్కల్లోలేని డబ్బును డిపాజిట్ చేస్తే దానిపై 60 శాతం ఆదాయపు పన్ను విధించటంపై చర్చించినట్లు తెలిసింది.
 
ప్రభుత్వం నోట్లరద్దుపై ప్రకటన చేసినప్పటి నుంచీ.. పలుమార్లు చేసిన అధికారిక ప్రకటనల వల్ల పన్ను చెల్లించని వారిపై తీవ్ర పరిణామాలు తప్పదనే సంకేతాలు వెలువడ్డాయి. 30 శాతం ఐటీకి తోడు అదనంగా 200 శాతం పన్ను విధించొచ్చని కొందరు అధికారులు వెల్లడించారు. కానీ, దీనికి ఐటీ చట్టం వీలు కల్పించటం లేదు. 
 
ప్రస్తుతం పెద్దమొత్తంలో డబ్బు అకౌంట్లలోకి చేరుతున్నందున.. పన్ను రేటును మార్చేందుకు ఆదాయపు పన్ను చట్టానికి ఈ శీతాకాల సమావేశాల్లోనే సవరణలు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. నల్లధనంపై 45 శాతానికి పైగా పన్ను విధించాలనే (60 శాతం వరకు) ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. బ్యాంకులు, ఆర్బీఐ ద్వారా డబ్బులు మార్చుకోని వారిపై అదనంగా 60 శాతం పన్ను విధించనున్నట్లు సమాచారం.