బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 5 నవంబరు 2020 (20:35 IST)

ఒడిస్సా అడవిలో అరుదైన బ్లాక్ టైగర్ గుర్తింపు

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
సాధారణంగా పులులు పసుపు ఛాయలో కనబడుతుంటాయి. కానీ కొన్ని పులులు జన్యు లోపం వలన ఇతర రంగులలో దర్శనమిస్తుంటాయి. ఎక్కువగా ఇలాంటి పులులు తెలుపు రంగులో కనబడుతుంటాయి. అయితే ఒడిస్సా అడవిలో ఓ అరుదైన నల్ల పులిని ఓ కెమెరా మెన్ గుర్తించాడు.
 
ఈ పులిపై పసుపు ఛాయలు తక్కువగా ఉండగా అత్యధిక భాగం నలుపు రంగులో ఉండటం గమనించారు. సామెన్ బాజ్‌పాయ్ అనే ఫోటోగ్రాఫర్ ఈ నల్ల పులిని ఫోటోలు తీయడంతో ఇది వెలుగులోనికి వచ్చింది. ఒడిస్సాలో సిమ్లిపాల్ పులుల అభయారణ్యంలో ఈ నల్ల పులిని గుర్తించారు. అడవిలో ఫోటోలు తీసేందుకు వెళ్లగా తన కంటికి అనేక జంతువులు, పక్షులు కనిపించాయని సామెన్ బాజ్ తెలిపారు.
 
ఆకస్మికంగా తన కంటికి ఈ నల్లపులి కనిపించడంతో మొదట దాని రంగును గుర్తించలేకపోయానని, ఆ తర్వాత అది అరుదైన పులి అనే విషయం తెలిసిందని తెలిపారు. దాంతో ఆ బ్లాక్ టైగర్‌ను ఫోటోలు తీసానని తెలిపారు. కాగా ఒడిస్సా అడవుల్లో బ్లాక్ టైగర్ కనిపించడం ఇదే తొలిసారి అని తెలిపారు. పులుల్లో మెలనిన్ పదార్థం ఎక్కువైనప్పుడు నలుపురంగు లోనికి మారుతాయని తెలిపారు. ఇది పరిమాణంలో రాయల్ బెంగాల్ టైగర్ కంటే కాస్త చిన్నవిగా కనిపించే ఈ బ్లాక్ టైగర్లు ప్రస్తుతం దేశంలో అతి తక్కువ సంఖ్యలో వున్నాయి.