శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 3 నవంబరు 2020 (22:00 IST)

రోడ్డు ప్రమాదం నుండి బయటపడిన వారికి రెండవ అవకాశం

ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణాలతో పోలిస్తే భారతదేశంలో ప్రమాద సంబంధిత మరణాలు రోడ్డు మార్గాల్లోనే ఎక్కువ. ఈ ప్రమాదాల గాయాల వల్ల ఎంతోమంది జీవితాంతం వికలాంగులుగా మిగిలిపోతారు. 2006లో చిగురపతి సుధీక్షణ్ అనే కాలేజి విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు, అక్కడ ఎంతోమంది ఉన్నా, ఎవ్వరూ సకాలంలో సహాయం చేయకపోవడం వల్ల తను ప్రాణాలు కోల్పోయారు. స్కూలు టీచర్ అయిన సుధీక్షణ్ తల్లి, ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న వందల మంది తన కొడుకుకి సహాయం అందించక పోవడం వల్ల తన బిడ్డ ప్రాణాలు కోల్పోయారు అని చాలా నొచ్చుకుంది.
 
12 సంవత్సరాల తరువాత, ఆమె విషాదాన్ని విజయంగా మార్చింది. తన ప్రియమైన కొడుకు జ్ఞాపకార్థం సుధీక్షణ్ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. రోడ్డు ప్రమాదాల బాధితులకు సహాయం చేయడానికి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి ఇది ఒక ట్రస్ట్. 2018 WHO రిపోర్టు ప్రకారం, 5 - 29 వయస్సు పిల్లల యువకుల మరణాలకి ప్రధమ కారణం రోడ్డు ప్రమాదాలు. భారతదేశంలో వెయ్యి జనాభాకు సుమారు 0.62 ఆంప్యూటీలు ఉన్నారని అంచనా.
 
కృత్రిమ అవయవాలు అవసరం ఉన్న పిల్లలు మరియు యువకులను గుర్తించడం, వారికి అవసరం అయినవి అందించడం సుధీక్షణ్ ఫౌండేషన్ యొక్క ప్రాజెక్టులలో ఒకటి. ఈ సంస్థ ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం మిలాప్‌తో ఆన్‌లైన్ నిధుల సేకరణను ప్రారంభించింది. ప్రమాదాలలో అవయవాలను కోల్పోయిన పిల్లలు, యువతకు సహాయం అందించడం ఈ ఫండ్ రైసర్ లక్ష్యం.
“ఈ సంస్థ ప్రధానంగా ప్రమాదాలకు చిన్న వయసులో ఉన్నవారికి, యువకులకు - వారి ముందు ఎంతో భవిష్యత్తు ఉన్నవారికి, విద్యార్ధులకి కృత్రిమ అవయవ దానం అందిస్తారు. ఈ సంస్థ బాధితుల ముందు ఉన్న జీవితం ఎంత అని చూసి సహాయం అందిస్తాము. మేము సహాయం చేసిన ఎంతోమంది ఇప్పుడు వారి చదువు పూర్తి చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు." అని సుధీక్షణ్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్ పర్సన్ సి.హెచ్. విమల అన్నారు. 2007 నుండి, ఈ ఫౌండేషన్ 6500 ప్రొస్తెటిక్ అవయవాలు, కాళ్ళు, చేతులు మరియు మోటర్ వీల్ చైర్లను అందించింది.