1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 జూన్ 2025 (09:43 IST)

ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

air india
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం కూలిపోయి 241 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ విమాన ప్రమాదంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. అయితే, శని, ఆదివారాల్లో అదే సంస్థకు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో సమస్యలు తలెత్తి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఈ రెండూ కోల్‌కతా వెళ్లాల్సిన విమానాలే కావడం గమనార్హం. 
 
గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు 170 మంది ప్రయాణికులతో వెళ్లాల్సిన ఐఎక్స్ 1226 విమానం శనివారం రాత్రి 9.20 గంటలకు బయలుదేరాలి. సాంకేతిక సమస్య పేరుతో అది ఆలస్యమైంది. ఈ విమానంలో సమస్య ఏమిటో, విమానం ఎప్పుడు బయల్దేరుతుందో తెలియక ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. దానిపై పలు వీడియోలు క్షణాల్లో చక్కర్లు కొట్టాయి. అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో వారిని విమానం దిగాలని చెప్పి ఒక హోటల్‌కు తరలించారు. 
 
ఆదివారం ఉదయం 9.30కి మళ్లీ విమానం ఎక్కించారు. అదే సాంకేతిక సమస్య వల్ల విమానం ఆలస్యమవుతోందని మరోసారి ప్రకటించారు. రెండోసారి కిందికి దించి, విమానాశ్రయంలోకి తరలించారు. వేరే విమానం ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. చివరకు అలా మరో విమానంలో సాయంత్రం 3.34 గంటలకు వారు బయల్దేరారు. కొందరు మాత్రం వేరే విమానాలను ఎంచుకున్నారు. కాగా, ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి బయల్దేరి 9.20కి కోల్‌కతాకు చేరాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం (ఐఎక్స్ 1511)లోనూ సాంకేతిక లోపం తలెత్తింది.
 
టేకాఫ్‌కు ముందు దీనిని గుర్తించిన సంస్థ అప్రమత్తమై ప్రయాణాన్ని నిలిపివేసింది. దీంతో అది రన్ వేపైనే గంటసేపు ఉండాల్సి వచ్చింది. ప్రయాణం 7 గంటలు ఆలస్యమవుతుందని, ప్రయాణికులకు కావాలంటే టికెట్ సొమ్ము వాపసు చేస్తామని సంస్థ వెల్లడించి తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. లోపాన్ని సరిచేశాక మధ్యాహ్నం 2.09 గంటలకు ఇది బయల్దేరి సాయంత్రం 4.24 గంటలకు గమ్యాన్ని చేరుకుంది.