ఎయిరిండియా విమానాన్ని పేల్చివేస్తాం : ఏఐ-114 బాంబు బెదిరింపు
బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 21వ తేదీన ఈ బెదిరింపు కాల్ రాగా, ఈ విషయం తాజాగా వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ విమానాన్ని రియాద్కు మళ్లించి, అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేశారు. ఆ తర్వాత ఆ విమానంలోని ప్రయాణికులందరినీ కిందకు దించేసి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని తేలడంతో అధికారులు, విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, విమానంలో భద్రతా తనిఖీలు పూర్తయ్యేంత వరకు ప్రయాణికులందరికీ వసతి సౌకర్యం కల్పించినట్టు ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు. అదేవిధంగా ప్రయాణికులందరూ గమ్యస్థానాలకు చేర్చేందుకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.
సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ ప్రయాణించిన కారు ఢీకొని సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో జగన్ ఉన్న కారు ముందు డ్రైవర్ వైపున ఉండే చక్రం కింద పడిచనిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయం తెలిసినా డ్రైవర్ కారు ఆపకుండా వెళ్లిపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా? ఆ సమాచారాన్ని జగన్కు తెలియజేశారా? ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? తదితర విషయాలపై జగన్ కారు డ్రైవర్ నుంచి సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటున్నారు. మరోవైపు జగన్ పర్యటనకు సంబంధించి వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన పర్యటనను ఎవరెవరు వీడియోలు తీశారనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి నుంచి ఫుటేజీని సేకరిస్తున్నారు.
మరోవైపు, ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య మృతికి కారణమైన వారిపై ముఖ్యంగా జగన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి దారుణ ఘటన జరిగినా తన కాన్వాయ్ కారణంగా సొంత పార్టీ కార్యకర్త మరణిస్తే కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడంతో జగన్ తీరును పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.