శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (07:41 IST)

ఓటు వేయకుంటే జీతం కట్... ఎవరికి?

టెక్కీలకు ఐటీ కంపెనీలు తేరుకోలేని షాకిచ్చింది. ఓటు హక్కును వినియోగించుకోని పక్షంలో ఒక రోజు వేతనం కట్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ తరహా వార్నింగ్ కర్ణాటక రాష్ట్రంలోని అన్ని ఐటీ కంపెనీలు జారీచేశాయి. 
 
ఎన్నికల సంఘం ఆదేశం మేరకు పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును ఆ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, ఐటీ కంపెనీలు మాత్రం ఈ ఆదేశాలను బేఖాతర్ చేసి కొన్ని షరతులు కూడా విధించాయి. ఓటు వేసినట్టు ఖచ్చితంగా ఆధారం చూపించాల్సిందేనని, హెచ్‌ఆర్ విభాగంలో ఓటు వేసినట్టు రుజువు చూపిస్తేనే ఆ రోజున వేతనంతో కూడిన సెలవు మంజూరవుతుందని, లేదంటే వేతనంలో కోత తప్పదని హెచ్చరించాయి.
 
కంపెనీల హెచ్చరికలతో ఉద్యోగులు తలలుపట్టుకుంటున్నారు. గురువారం పోలింగ్ సెలవు, రెండు వీకెండ్ హాలిడేస్ కలుపుకుంటే వరుసగా మూడు రోజులపాటు సెలవులు ఎంజాయ్ చేయాలనుకున్న ఉద్యోగులు కంపెనీల ఉత్తర్వులతో షాక్‌కు గురయ్యారు. 
 
ఇక, ఐటీ సంస్థలు హెచ్చరికలు నిజమైన ఉద్యోగులు అందరూ ఓటింగ్‌లో పాల్గొంటే బెంగళూరులో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 10 లక్షల ఓట్లు అధికంగా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేసేందుకు సహకరించాలంటూ ఎన్నికల సంఘం చేసిన సూచన మేరకు ప్రముఖ ఐటీ కంపెనీలు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.