శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (11:22 IST)

ప్రేమికుడి కోసం తండ్రిని దారుణంగా హత్య చేసిన కుమార్తె..

చదువుకునేది తొమ్మిదో తరగతి తండ్రిని చంపేసింది. ప్రేమ కోసం తండ్రినే చంపుకుంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు రాజాజీనగర ఐదో బ్లాక్‌‌లో ఓ వ్యాపారి నివాసం ఉంటున్నాడు. తొమ్మిదో తరగతి చదివే కుమార్తె వుంది. ఆమె తన ఇంటికి సమీపంలోనే ఉంటూ బీకామ్ చదువుకుంటున్న ప్రవీణ్‌ అనే యువకుడితో చనువుగా ఉండేది. 
 
ప్రవీణ్ పదేపదే తమ ఇంటికి రావడాన్ని చూసిన ఆమె తండ్రి వారించాడు. దీంతో ఆ బాలిక తండ్రిపై కోపం పెంచుకుంది. అతను ఉంటే తమ పరిచయం కొనసాగదని భావించి, అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఇందుకోసం పక్కా స్కెచ్ వేసింది. గత ఆదివారం నాడు తన తల్లి, తమ్ముడు పాండిచ్చేరికి బయలుదేరుతుంటే, వారిని దింపివస్తానని చెప్పి రైల్వే స్టేషన్‌కు బయలుదేరిన ఆమె, వెళుతూ వెళుతూ తండ్రికి నిద్రమాత్రలు కలిపిన పాలను ఇచ్చింది. 
 
ఇద్దరినీ రైల్లో పంపి వచ్చేసరికి, తండ్రి నిద్రపోతుంటే, ప్రియుడైన ప్రవీణ్‌ను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి ఆయన్ను విచక్షణారహితంగా గొంతు కోసి, ఆపై కత్తితో పొడిచి చంపేశారు. మృతదేహాన్ని బాత్ రూమ్‌లో పడేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే, కొంత పెట్రోల్ వారిపైనా పడటంతో మంటలు విస్తరించాయి. దీంతో బాలిక మిద్దెపైకి ఎక్కి కేకలు పెట్టింది. 
 
చుట్టుపక్కలవారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటల్ని ఆర్పి, గాయపడ్డ ఇరువురినీ ఆసుపత్రికి తరలించారు. తొలుత తాము బయటకు వెళ్లి టిఫిన్ చేసి వచ్చేసరికి మంటలు అంటుకున్నాయని చెప్పిన ఆమె, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆసలు నిజాన్ని అంగీకరించింది.