బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (13:05 IST)

సీఎం భార్యకే టోకరా.. రూ.23 లక్షలు స్వాహా చేసిన కేటుగాడు

దేశంలో సైబర్ నేరగాళ్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ టార్గెట్ చేస్తూ... లక్షల కొద్దీ సొమ్మును కాజేస్తున్నవారు ఉన్నారు. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య, ఎంపీ ప్రణీత్ కౌర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో పడ్డారు. 
 
బ్యాంకు మేనేజర్‌ పేరిట వచ్చిన కాల్‌ కారణంగా 23 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే పార్లమెంటు సమావేశాలకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రణీత్‌ కౌర్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను బ్యాంకు మేనేజర్‌ను అని, ఎంపీ జీతం డిపాజిట్‌ చేసే అకౌంట్‌ అప్‌డేట్‌ కోసమే కాల్‌ చేసినట్లు చెప్పాడు. 
 
ఈ మేరకు అకౌంట్‌ నంబరు, ఏటీఎం పిన్‌ నంబరు, సీవీసీ నంబరు తదితర వివరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. అతడి మాటలు నమ్మిన ప్రణీత్‌ కౌర్‌ వివరాలతో సహా ఓటీపీ కూడా చెప్పారు. ఈ క్రమంలో కొన్ని నిమిషాల తర్వాత ఆమె అకౌంట్‌ నుంచి 23 లక్షల రూపాయలు డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. 
 
తాను మోసపోయినట్లుగా గుర్తించిన ప్రణీత్‌ కౌర్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. అక్కడే అతడిని అరెస్టు చేసి పంజాబ్‌ తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.