1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఉత్తరాంఖండ్ సీఎం రాజీనామాతో బెంగాల్ సీఎం మమతకు చిక్కులు?

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలు ముగిసిపోయాయి. ఎన్నికల ఫలితాలూ వచ్చాయి. టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ బంపర్ విజయం సాధించింది. బీజేపీ ప్రతిపక్ష స్థానంలో కూర్చుంది. అయితే, ఇపుడు మమతకు కొత్త చిక్కు వచ్చిపడింది. 
 
ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ సీఎం స్థానానికి రాజీనామా చేయడంతో సమస్య ఉత్పన్నమైంది. ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రాజీనామా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ రాజీనామా వల్ల సీఎం మమతకు ఇబ్బందులు తలెత్తేలా బీజేపీ పెద్దలు వ్యూహం పన్నినట్లు సమాచారం. తీరథ్ సింగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు కూడా గడవలేదు. అప్పుడే రాజీనామా చేసేశారు.
 
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అచ్చు తీరథ్ పరిస్థితినే ఎదుర్కొనే అవకాశాలున్నాయి. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారు. ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సుబేందు అధికారి బరిలోకి దిగి, మమతను ఓడించారు. అయినా... మమత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 
 
ఆరు నెలల్లోగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. అందుకు అనుగుణంగానే ఆమె భవానీపూర్ నుంచి బరిలోకి దిగనున్నారు. నవంబరు 4 నాటికి ఆమె ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సిందే. అయితే ఉత్తరాఖండ్‌లో లాగా బెంగాల్‌లో కూడా శాసన మండలి ఉనికిలో లేదు. దీంతో మమతకు ఎమ్మెల్సీ ఛాన్స్ లేదు. 
 
ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి తీరాల్సిందే. అయితే మూడో వేవ్ ముంచుకొచ్చే అవకాశాలున్నాయని నిపుణుల హెచ్చరికలతో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో బెంగాల్‌పై అందరి కన్నూ పడింది. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తనుందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. తీరథ్ లాగే మమత కూడా రాజీనామా చేస్తారా? చేస్తే ఆమె స్థానే ఎవర్ని ముఖ్యమంత్రిగా నియమిస్తారన్నది చూడాలి.