1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (13:04 IST)

గుజరాత్‌లో జూలు విదిల్చిన కమలనాథులు - ఏడోసారి విజయభేరీ

bjp flags
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కమలనాథులు జూలు విదిల్చారు. ఫలితంగా ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వరుసగా ఏడోసారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గత ఎన్నికల్లో కేవలం 99 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈ దపా మాత్రం ఏకంగా 156 స్థానాలను కైవసం చేసుకుంది. అదేసమయంలో ఎన్నికల్లో 80కి పైగా స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు కేవలం 17 సీట్లకే పరిమితమైంది. గుజరాత్ బరిలో తొలిసారి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాలను గెలుచుకుని తన ఉనికి చాటుకుంది.
 
గుజరాత్ రాష్ట్రంలో గత 1995 నుంచి బీజేపీ విజయం అప్రహతింగా కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 
 
అయితే, పంజాబ్ రాష్ట్రంలో సంచలన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ బరిలోకి దూకడంతో ఓట్లు చీలే అవకాశం ఉంటుందని, బీజేపీకి నష్టం జరగొచ్చని అంచనా వేశారు. అయితే, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ భారీ సంఖ్యలో సీట్లను కొల్లగొట్టింది. ఫలితంగా మరోమారు గుజరాత్ పీఠాన్ని ఖాయం చేసుకుంది. 
 
గతంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వరుసగా ఏడుసార్లు గెలిచిన ఘనత సీపీఎం పార్టీకి ఉంది. ఇపుడు ఆ రికార్డును బీజేపీ సొంతం చేసుకుంది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 92. అయితే, ఈ సంఖ్యను మధ్యాహ్నానికే దాటిసేన కాషాయదళం... సాయంత్రానికి 150కి పైగా స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. 
 
అయితే, ఎన్నికలు జరిగిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి 25 సీట్లు, ఇతరులు మూడు చోట్ల గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క చోట కూడా నెగ్గలేక పోయింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 1985 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వాన్ని మార్చడం ఓటర్లకు ఆనవాయితీగా వస్తుంది. ఇపుడు మరోమారు ఇది పునరావృతమైంది.