1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (10:02 IST)

ఢిల్లీ స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకే 'ఉమ్మడి' నాటకం

bandi sanjay
ఢిల్లీ మద్యం స్కామ్‌లో చిక్కుకునివున్న తన కుమార్తె కె.కవితపై నుంచి దృష్టి మరల్చేందుకే ఏపీలోని వైకాపాతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే తమ ఓటు అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఇరు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిపై బండి సంజయ్ స్పందించారు. సజ్జల వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ప్రయోజనాలు దాగివున్నాయని చెప్పారు. 
 
జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుమార్తె కవి రూ.లక్ష కోట్ల లిక్కర్ దందా చేశారని, కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ వైకాపా నేతలతో కలిసి కుట్రలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.
 
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి సరికొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వారిద్దరూ కలిసే ఉన్నారని, కమీషన్లు పంచుకుంటున్నారని బండి ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌తో మాట్లాడి వైకాపా నాయుకుడితో ఈ వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. సజ్జల వ్యాఖ్యలతో తెలంగాణాలో మళ్లీ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటూ వైకాపా - తెరాసల కొత్త డ్రామా! 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటూ వైకాపా, తెరాస పార్టీలు సరికొత్త డ్రామాలకు తెరలేపాయని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే తమ ఓటు అని తెలుగు రాష్ట్రాలు రెండూ కలిసిపోతే స్వాగతిస్తామంటూ ఏపీ ప్రభుత్వ సలదాహారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాజీయ దుమారం రేపుతున్నాయి. 
 
వీటిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. వైకాపా-తెరాస రాజకీయ డ్రామా మళ్లీ మొదలైందని అన్నారు. ఏపీ తెలంగాణ విభజన కేసులు మూసివేయాలంటూ సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ వేశారో చెప్పాలని ఆయన వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైకాపాది ఢిల్లీలో ఒక మాట, ఆంధ్రా గల్లీలో మరొక మాట అని విమర్శించారు. 
 
ఉమ్మడి ఏపీని చేసేందుకు కృషి : సజ్జల రామకృష్ణా రెడ్డి 
నవ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన రెండు రాష్ట్రాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా మళ్లీ ఒక్కటి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఏపీలో సకల శాఖామంత్రిగా పేరుగడించిన ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 
 
రాష్ట్ర విభజన తీరుపై సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. వీలైతే ఏపీని మళ్లీ ఉమ్మడిగా ఉండాలన్నదే తమ పార్టీ విధానమని, రెండు రాష్ట్రాలు కలిసిపోతే తొలుత స్వాగతించేది వైకాపాయేనని సజ్జల స్పష్టం చేశారు. 
 
ఇపుడే కాదు.. ఎపుడైనా ఉమ్మడి రాష్ట్రానికే తమ ఓటు అని ఏ వేదికపై అయినా ఇదే మాట చెబుతామని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం పార్టీ వైఖరి కూడా ఇదేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
విభజనకు వ్యతిరేకంగా తమ వాదనలు బలంగా వినిపించామని, చెప్పారు. రాష్ట్ర విభజనను పునఃసమీక్షించాలని లేదా సరిదిద్దాలని కోరతామని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముందని ఆయన తెలిపారు.