బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 27 ఆగస్టు 2022 (20:45 IST)

వరంగల్: ‘కరీంనగర్ జైల్లో కేసీఆర్‌కు రూం రెడీ చేసి వచ్చిన’ - బండి సంజయ్

Nadda-Bandi
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. నడ్డా తన ప్రసంగంలో కేసీఆర్‌ను ఈ కాలం నిజాం అని అభివర్ణించారు. ఈ నిజాం అధికారం ముగిసిపోయే రోజు వచ్చిందని చెప్పుకొచ్చారు.

 
చివరి నిజాం ఎలాగైతే ప్రజల మీ ఆంక్షలు విధించారో, కేసీఆర్ కూడా ఆలాగే చేస్తున్నారనీ, బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈ చీకటి తొలగిపోయి, తెలంగాణలో వెలుగు వస్తుందని నడ్డా అన్నారు. పోలీసు వలయాలను, నిర్బంధాలను ఛేదించుకుని మహా సంగ్రామ యాత్ర ముగింపు సభకు వచ్చిన ప్రజలకు నమస్కారాలు అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

 
‘‘కేసీఆర్ నన్ను జైల్లో పెట్టించారు. కరీంనగర్ జైల్లో ఉండి నేను కేసీఆర్‌కు అక్కడ రూం రెడీ చేసి వచ్చిన” అని సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 12 నుంచి తెలంగాణలో నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నామని కూడా సంజయ్ ఈ సభలో ప్రకటించారు. ‘‘కేసీఆర్ ఫామ్ హౌజ్‌ను వీడింది లేదు.. వరంగల్‌ను అభివృద్ధి చేసింది లేదు. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఏమైందో అందరికీ తెలుసు’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

 
‘‘కేంద్ర ప్రభుత్వం యాదాద్రి నుంచి వరంగల్‌కు రూ. 388 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించింది. జగిత్యాల నుంచి కరీంనగర్ రోడ్డుకు రూ. 4,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నాం. వరంగల్‌లో స్మార్ట్‌ సిటీ కోసం కేంద్రం 196 కోట్లు ఖర్చు చేసిందని, వరంగల్‌ జిల్లాలో సైనిక స్కూల్ రాబోతోంది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తాం’’ అని ఆయన చెప్పారు.

 
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చామని, రామప్ప ఆలయ అభివృద్ధి కోసం రూ. 60 కోట్లు ఖర్చు చేస్తున్నామని, వెయ్యి స్తంభాల ఆలయ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.