శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 4 జులై 2019 (15:57 IST)

ఇంజనీర్‌పై బురద పోసి బ్రిడ్జికి కట్టేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఎక్కడ?

ప్రభుత్వ ఉద్యోగులపై రాజకీయ నేతల దౌర్జన్యాలు మరింతగా హెచ్చుమీరిపోతున్నాయి. మొన్నటికిమొన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన ఇంజనీర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఒకరు క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశారు. ఇపుడు, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించేందుకు వెళ్లిన ఇంజనీర్‌పై రెండు బక్కెట్ల బురద పోసి ఆయన్ను చెట్టుకు కట్టేశారు. ఈ పనికి పాల్పడింది కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి వెళ్లిన మున్సిపల్ అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీయ దాడిచేసిన విషయం తెల్సిందే. తాజాగా ఆ ఘటన స్ఫూర్తితో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నితీష్ నారాయణ్ రాణే, ఆయన అనుచరులు రెచ్చిపోయారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్డును పరిశీలిస్తున్న ఇంజనీర్‌పై రెండు బకెట్ల నిండా బురదను పోసి అవమానించారు. 
 
కంకవళ్లి ప్రాంతంలో ముంబై-గోవా జాతీయ రహదారిపై గుంతలను పరిశీలించేందుకు హైవే ఇంజనీర్ ప్రకాశ్ షెడేకర్ గురువారం చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాణే, ఆయన అనుచరులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఇంజనీరుతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఇంజనీర్‌పై చిక్కటి బురద పోసి, తాళ్లతో పక్కనే ఉన్న బ్రిడ్జికి కట్టేసి అవమానించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.