సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత
టాలీవుడ్ సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెపై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టివేస్తూ కర్నాట హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు.
గతేడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఘటన తన జీవితాన్ని అతలాకుతలం చేసిందని, ఆ కేసులో తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని ఇప్పుడు న్యాయస్థానం తీర్పుతో తేలిపోయిందన్నారు. ఈ నెల 3వ తేదీనే తీర్పు వెలువడినా, జడ్జిమెంట్ కాపీ చేతికి అందే వరకు ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదన్నారు.
ఈ కేసు విచారణ సమయంలో మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలు, ట్రోలింగ్ తన తల్లిని మానసికంగా కృంగదీశాయని హేమ ఆరోపించారు. 'ఫేక్ న్యూస్, ట్రోలింగ్ మా అమ్మను చంపేశాయి. నాపై వచ్చిన నిందలను ఆమె తట్టుకోలేకపోయారు. తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో భౌతికంగా దూరమయ్యారు' అంటూ ఆమె వాపోయారు. తాను నిర్దోషినని, ఏ తప్పూ చేయలేదని ఆమె స్పష్టం చేశారు.
'సింహం రెండు అడుగులు వెనక్కి వేస్తే పారిపోతున్నట్టు కాదు, మళ్లీ దూకడానికే. నేను కూడా అలాగే నిలబడ్డాను. దేవుడి దయతో కేసు గెలిచాను. కానీ, ఈ ట్రోలింగ్ వల్ల నేను చనిపోయి ఉంటే, ఈ తీర్పు ఎవరికి ఉపయోగం? నన్ను ఎవరు బతికిస్తారు?. ఏడాదిన్నరగా తాను, తన కుటుంబం మానసికంగా, శారీరకంగా తీవ్ర క్షోభ అనుభవించాం. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, తన తల్లిని కోల్పోవడం తీరని లోటు' అని ఆమె పేర్కొన్నారు.