1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (20:35 IST)

కాంగ్రెస్ సీనియర్ల తిరుగుబాటు? ఆజాద్ ఇంటికి నేతల క్యూ!!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. అంతర్గత కుమ్ములాటల కారణంగా అధికారంలో ఉన్న పంజాబ్‌ హస్తం చేజారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా నామమాత్రపు ప్రభావాన్నే చూపించింది. దీంతో ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. 
 
దీనికి కారణం ఎవరు అంటూ కాంగ్రెస్ పార్టీ మథనం మొదలైంది. ఇంతటి ఘోర పరాజయానికి కారణం ఎవరు? అంటూ పార్టీలోని సీనియర్ నేతలు వరుసగా తమ గళం విప్పుతున్నారు. ముఖ్యంగా పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ బుధవారం చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చుకోలేని సంకటస్థితిలోకి వెళ్లిపోయింది. 
 
ఇదిలావుంటే, ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ ఇంటికి బుధవారం సాయంత్రం అనేక మంది సీనియర్ నేతలు క్యూకట్టడం దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కపిల్ సిబల్ కూడా గులాం నబీ ఆజాద్ ఇంటికి వెళ్లారు. 
 
అలాగే, సీనియర్ నేతల మనీశ్ తివారీ, ఆనంద్ శర్మ, శశిథరూర్, మణి శంకర్ అయ్యర్, పీజే కురియన్, పరిణీత్ కౌర్, సందీప్ దీక్షిత్, రాజ్ బబ్బర్, భూపిందర్ సింగ్ హుడా ఇలా మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారు. 
 
వీరంతా ఒక్కసారిగా గులాం నబీ ఆజాద్ ఇంటికి క్యూకట్టడానికి కారణం ఏమై ఉంటుందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలోనేకాదు దేశ రాజకీయాల్లోనూ మొదలైంది. మొత్తంమీద సీనియర్ నేతల వైఖరిని చూస్తుంటే మునుపెన్నడూ చోటుచేసుకోని పరిణామం ఏదో జరగడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.