గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మే 2021 (08:29 IST)

మద్యం బాబులకు కరోనా సోకితే మటాషే... వైద్యులు హెచ్చరిక

దేశ ప్రజలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు సంపూర్ణ ఆరోగ్యవంతులు కూడా మృత్యువాతపడుతున్నారు. ఇందులో యువత కూడా ఉంది. ఈ క్రమంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై రెండోదశ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రధానంగా, మద్యపానం, ధూమపానం అధికంగా సేవించేవారికి కరోనా వస్తే కోలుకునే రేటు తక్కువగా, మరణాల రేటు అధికంగా ఉంటోందని తెలిపారు. మద్యపానం సేవించేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే దీనికి కారణమని విశ్లేషించారు. 
 
మొదటిదశ కరోనా వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలున్న వారిపై ఎక్కువ ప్రభావం చూపించగా.. రెండోదశలో యువత, చిన్నారులు, గర్భిణులు సైతం దీని బారిన పడుతున్నారని వైద్య నిపుణులు అంటున్నారు. గర్భిణులు పాజిటివ్‌గా ఉంటే ప్రసవం తర్వాత, అప్పుడే పుట్టిన పిల్లలకు వైరస్‌ ఉన్నట్టు ఇంతవరకు తేలలేదన్నారు. 
 
కానీ ప్రసవం తర్వాత శిశువులకూ పాజిటివ్‌ వస్తోందన్నారు. శిశువులు, చిన్నారుల్లో తీవ్రత మాత్రం ఎక్కువగా ఉండటం లేదని, అయిపనప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చిన్నారుల్లో గొంతులో ఇబ్బంది, అన్నం తినడానికి ఇబ్బంది పడటం, జ్వరం, విరేచనాలు చిన్నారుల్లో కరోనా లక్షణాలు అని పేర్కొన్నారు.
 
ఆక్సిజన్‌ లెవల్‌ 94 కంటే తక్కువగా ఉంటేనే ఆక్సిజన్‌ అవసరం ఉంటుందని, అప్పటివరకు ఎలాంటి ఆందోళనా అవసరం లేదన్నారు. ప్రతి రోజూ బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌తో ఆక్సిజన్‌ స్థాయిని పెంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచించారు. 18 సంవత్సరాల్లోపున్న చిన్నారులకు వ్యాక్సిన్‌ వద్దని, వీరికి వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు.