మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (14:37 IST)

కంగ్రాచ్యులేషన్స్ మమతా దీదీ... బెంగాల్‌లో ప్రభంజనం..

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పలువురు నేతలు ముందస్తు అభినందనలు తెలిపారు. "కంగ్రాచ్యులేషన్స్ మమతా దీదీ... బెంగాల్ లో ప్రభంజనం సృష్టిస్తున్నారు. నిజంగా ఏమి పోరాటం!" అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 
 
కేజ్రీవాల్ వ్యాఖ్యల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఢీ అంటే ఢీ అనేలా తలపడుతూ, 8 విడతల అసెంబ్లీ ఎన్నికలను ఆమె నిబ్బరంతో ఎదుర్కొన్నారు. దానికి తగ్గట్టే కౌంటింగ్ ట్రెండ్స్ వెలువడుతున్నాయి.
 
మధ్యాహ్నం 2.15 గంటల సమయానికి తృణమూల్ 202 స్థానాల్లో ముందంజ వేయడమే కాకుండా, 9 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో టీఎంసీతో హోరాహోరీ పోరు సాగించిన బీజేపీ... అధికార పక్షానికి దరిదాపుల్లో లేకున్నా గణనీయమైన స్థాయిలోనే ఉనికిని చాటుకుంటోంది. ఆ పార్టీ ప్రస్తుతం 82 స్థానాల్లో ముందంజలో ఉండగా, రెండు సీట్లలో నెగ్గింది. 
 
మరోవైపు, అటు, నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ, ఆధిక్యం రౌండు రౌండుకు చేతులు మారుతోంది. దాంతో విజయంపై ఉత్కంఠ ఏర్పడింది. తొలి ఐదు రౌండ్ల వరకు సువేందు ఆధిపత్యంలో ఉండగా, ఆ తర్వాత మమతా బెనర్జీ పై చేయి సాధించారు. ఇపుడు మళ్లీ సువేందు కొనసాగుతున్నారు.