1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (11:36 IST)

గగనతలంలో చిగురుటాకులా ఊగిన విమానం... ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు..

indigo
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానం గగనతలంలో చిగురుటాకులా ఊగిపోయింది. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పునర్జన్మ పొందారు. భారీ వర్షానికితోడు విపరీతంగా మంచు కురియడంతో ఈ పరిస్థితి నెలకొంది. విమానం ఊగిపోతుంటే కుర్చీలను ప్రయాణికులు గట్టిగా పట్టుకుని కూర్చొన్నారు. ఇందులో ప్రయాణించిన ప్రయాణికులంతా తమకు ఇది పునర్జన్మ వంటిదని వారు అన్నరు.
 
ఇండిగో 6ఈ6125 విమానం ఒకటి సోమవారం సాయంత్రం 5.28 గంటలకు ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరింది. ఆ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే వర్షం కారణంగా ఊగిపోయింది. విమానం చిగురుటాకులా ఊగుతుంటే ప్రయాణికులు మాత్రం కుర్చీలను పట్టుకుని కూర్చొన్నారు. అదేవిమానంలో ప్రయాణిస్తున్న కాశ్మీర్ సేవా సంఘ్ చీఫ్ బాబా ఫిర్దౌస్ మాట్లాడుతూ.. తనతో పాటు విమానంలోని అందరికీ పునర్జన్మ లంభించిందని పేర్కొన్నారు. అయితే పైలెట్లు చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. 
 
జమ్మూకాశ్మీర్ సహా పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. మరోవైపు దట్టమైన మంచు కురిసింది. ఫలితంగా కొండచరియలు సైతం విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు రహదారులపై చిక్కుకునిపోయారు.