మంగళవారం, 1 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 జులై 2025 (14:31 IST)

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

couple
కొత్త జీవితాన్ని కొనసాగించేందుకు వచ్చే దేశం విడిచి మరో దేశంలోకి అడుగుపెట్టిన ఓ ప్రేమజంట కథ విషాదాంతమైంది. రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారిలో కఠిన వాతావరణ పరిస్థితులు, మండుతున్న ఎండలను తట్టుకోలేక దాహంతో ఓ ప్రేమజంట ప్రాణాలు విడిచింది. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో వారి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతంలో శనివారం ఓ స్థానిక పశువుల కాపరి రెండు మృతదేహాలను గుర్తించి, వెంటనే సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతులు పాకిస్థానీ జాతీయులుగా గుర్తించారు. వారి వద్ద లభించిన ఓటరు గుర్తింపు కార్డుల ఆధారంగా, మృతులను పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన రవి కుమార్ (17), శాంతి బాయి (15)గా గుర్తించారు. వారి వద్ద పాకిస్థాన్‌కు చెందిన మొబైల్ సిమ్ కార్డు కూడా దొరికింది.
 
మృతదేహాలు పూర్తిగా నల్లగా మారిపోయి ఉండటం, యువకుడి నోటి వద్ద ఓ వాటర్ క్యాన్ పడి ఉండటంతో.. వారు దాహం తట్టుకోలేక, తీవ్రమైన డీహైడ్రేషన్‌తో మరణించి ఉంటారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పాకిస్థాన్‌లోని తమ ఇంటి నుంచి బయలుదేరిన ఈ జంట, కాలినడకన అక్రమంగా సరిహద్దు దాటే ప్రయత్నంలో ఎడారిలో దారి తప్పిపోయి ఉంటుందని భావిస్తున్నారు. యువతి చేతులకు కొత్త పెళ్లికూతురు ధరించే విధంగా ఎరుపు, తెలుపు గాజులు ఉండటం అందరినీ కలచివేసింది.