1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (17:41 IST)

జాతీయ వైద్య దినోత్సవం.. వైద్య దంపతుల ఆత్మహత్య

జాతీయ వైద్య దినోత్సవం రోజున విషాదం చోటుచేసుకుంది. వైద్య దంపతులు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్లను నిఖిల్ శేండ్కర్, అతని భార్య అంకితగా గుర్తించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. 
 
నిఖిల్, అంకితలకు 2019లో వివాహం జరిగింది. వీరిద్దరు కలిసి పుణెలోని వాన్వాడిలోని ఆజాద్‌నగర్‌లో నివసిస్తున్నారు. తొలుత వీరిద్దరు వాన్వాడిలో ఒకే క్లినిక్‌లో ప్రాక్టీస్ చేసేవారు. అయితే మూడు నెలల క్రితం.. నిఖిల్ కర్సుద్దిలోని వేరే క్లినిక్‌లో చేరాడు. 
 
ఇక, గత కొంతకాలంగా నిఖిల్, అంకిత దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. చిన్న, చిన్న విషయాలకు వాళ్లు గొడవపడేవారు. బుధవారం నిఖిల్ కర్సుద్దిలోని క్లినిక్‌లో ఉన్న సమయంలో మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న తన పెషేంట్ ఒకరి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నిఖిల్ వేరే క్లినిక్‌లో పనిచేస్తుండటంతో.. ఆ పేషెంట్‌ను చూడాల్సిందిగా అంకితను కోరాడు. అయితే అందుకు అంకిత నిరాకరించింది.
 
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత అంకిత ఫోన్ మాట్లాడుతుండగానే.. నిఖిల్ కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత తన రూమ్‌లోకి వెళ్లిన అంకిత్.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక, సాయంత్రం ఇంటికి చేరకున్న నిఖిల్.. భార్య ఆత్మహత్య చేసుకుని ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత తాను కూడా వేరే గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఇక, మరసటి రోజు ఉదయం.. వారి ఇంట్లో పనిచేసు మహిళ అక్కడికి చేరుకుంది. అయితే చాలా సేపటి వరకు ఇంటి తలుపులు తెరవకపోవడంతో.. ఆమె చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
 
దీంతో వెంటనే నిఖిల్, అంకితల ఇంటికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టారు. అక్కడ వేర్వేరు గదుల్లో నిఖిల్, అంకితలు ఉరికి వేలాడుతూ కనిపించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.