గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (17:15 IST)

బ్యాంకు మేనేజరు ప్రాణం తీసిన చేతిరాత కరోనా రిపోర్టు!

ఇద్దరు ల్యాబ్ టెక్నీయన్లు చేసినపనికి ఓ బ్యాంకు మేనేజరు ప్రాణాలు కోల్పోయాడు. కరోనా సోకినప్పటికీ.. కరోనా సోకలేదని చేతి రాతతో రాసి ఓ నకిలీ రిపోర్టును ఇచ్చారు. దీంతో కరోనా సోకలేదన్న ధీమాతో ఇంట్లోనే వున్న ఆ బ్యాంకు మేనేజరు చివరకు కరోనా వైరస్‌కు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సౌత్ కోల్‌కతాకు చెందిన 57 యేళ్ళ వ్యక్తి ఓ బ్యాంకు మేనేజరుగా పని చేస్తున్నారు. ఈయన గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చాడు. దీంతో కరోనా టెస్టు చేయించుకోవాలని ఫ్యామిలీ వైద్యుడు సూచించాడు. ఓ ల్యాబ్ టెక్నీషియన్‌కు సంబంధించిన వివరాలను డాక్టర్ వారికి ఇచ్చారు. 
 
అయితే మేనేజర్ కదలలేని పరిస్థితిలో ఉండటంతో.. ల్యాబ్ టెక్నీషియనే ఇంటికి వచ్చి శాంపిల్ సేకరించాడు. ఆ తర్వాత.. మేనేజర్‌కు కరోనా లేదంటూ ఫోన్‌లో సమాచారం అందించాడు. వాట్సాప్ ద్వారా కూడా సందేశం పంపించడమే కాకుండా.. హార్డ్ కాపీని కూడా కుటుంబసభ్యులకు అందించాడు. 
 
అయితే ఇటీవల మేనేజర్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎమ్ఆర్ బంగూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మేనేజర్ కరోనా రిపోర్టును పరిశీలించి అది నకిలీదని తేల్చారు. రిపోర్టుపై ఉన్న పేషెంట్ ఐడీలో తొమ్మిది అంకెలే ఉన్నాయని, సాధారణంగా 11 అంకెలు ఉంటాయని చెప్పారు. 
 
అంతేకాకుండా.. చేతితో ఈ అంకెలు రాయడాన్ని కూడా వారు ఎత్తి చూపారు. అయితే గురువారం నాడు ఆరోగ్యం పరిస్థితి విషమించి మేనేజర్ మృతి చెందారు. దీంతో మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా సోకిందని ముందుగా తెలిసుంటే భర్తను కాపాడుకోగలిగి ఉండేదాన్నని, నకిలీ రిపోర్టు కారణంగా కాలయాపన జరిగిని భర్త చనిపోయాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గతంలో వచ్చిన వాట్సాప్ మేసేజీల ఆధారంగా ఇంద్రజిత్ సిక్దర్ (26), బిశ్వజిత్ సిక్దర్ (23) అనే ఇద్దరు నిందితులతో పాటు ల్యాబ్ నిర్వాహకుడుని అరెస్టు చేశారు.