మంగళవారం, 1 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 జులై 2025 (14:54 IST)

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

shefali jariwala
బాలీవుడ్ నటి షఫాలీ జరివాలా 42 యేళ్ల వయసులో ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో ఆమె మృతికి గల కారణాలను వెల్లడించారు. ఆమె మృతికి యాంటీ ఏజింగ్ మందులు, వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవడమే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ కోణంలో విచారణను వేగవంతం చేశారు.
 
జూన్ 27, శుక్రవారం రాత్రి షఫాలీ అస్వస్థతకు గురికావడంతో ఆమె భర్త పరాగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తొలుత ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చినా, కుటుంబ సభ్యులు ఆ వార్తలను ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆమె మరణంపై పలు రకాల కథనాలు ప్రచారంలోకి రాగా, పోలీసుల దర్యాప్తులో కొన్ని ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
 
తాజా దర్యాప్తు వివరాలను ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. 'శుక్రవారం షఫాలీ ఉపవాసం ఉన్నారు. అదే రోజు మధ్యాహ్నం ఆమె యాంటీ ఏజింగ్‌కు సంబంధించిన ఇంజెక్షన్ తీసుకున్నారు. రాత్రిపూట కూడా ఖాళీ కడుపుతోనే పలు మాత్రలు వేసుకున్నారు. దీంతో ఆమె రక్తపోటు (బీపీ) ఒక్కసారిగా పడిపోయి ఉండొచ్చు' అని ఆయన తెలిపారు. బీపీ బాగా తగ్గిపోవడంతో ఆమెకు వణుకు మొదలైందని, ఆ తర్వాత కుప్పకూలిపోయారని సదరు అధికారి వివరించారు. 
 
ఈ కేసును విచారిస్తున్న అంబోలి పోలీసులు ఇప్పటివరకు 10 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. మృతురాలి భర్త, తల్లిదండ్రులు, ఇంటి పనిమనిషి సహా ఆమె కుప్పకూలినప్పుడు ఇంట్లో ఉన్నవారందరినీ విచారించారు. అయితే, ఇప్పటివరకు వారి వాంగ్మూలాల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. 
 
ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా షఫాలీ ఇంటిని సందర్శించి, ఆమె వాడిన మందులు, ఇంజెక్షన్ నమూనాలను శాస్త్రీయ పరీక్షల కోసం సేకరించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఈ మృతి కేసులోని వాస్తవం తెలుస్తుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.