ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (20:57 IST)

విద్యార్థితో పెళ్లి.. కట్టుకున్న భార్య బిడ్డను వదిలేసిన ప్రభుత్వ టీచర్

ప్రభుత్వ టీచరైన వ్యక్తి తన విద్యార్థినే వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. దీనికోసం కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను వదులుకునేందుకు సిద్ధమయ్యాడు. పుదుచ్చేరికి చెందిన సెంథిల్ కుమార్ అనే వ్యక్తి గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. 
 
కలితీర్థల్‌కుప్పం ప్రాంతానికి చెందిన మహేశ్వరి అనే మహిళ, ఇతను 16 ఏళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2018లో చాలా సంవత్సరాల తర్వాత పాప పుట్టింది. 
 
పాప పుట్టిన నాలుగేళ్ల తర్వాత భార్యాభర్తలిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఇద్దరూ చీటికీమాటికీ గొడవ పడుతుండేవారు. 
 
ఈ క్రమంలోనే.. తను చదువు చెప్పే స్కూల్‌లో రేఖ అనే యువతితో సెంథిల్ కుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఈ గురుశిష్యురాలు ఇద్దరూ బాగా దగ్గరయ్యారు.
 
ఎంతలా అంటే.. టెన్త్ పూర్తయ్యాక ఆమెను తన సొంత డబ్బులతో ఫీజు కట్టి మరీ సెంథిల్ చదివించాడు. ఆమె ప్రస్తుతం డిగ్రీ కూడా పూర్తి చేసింది. 
 
ఆ యువతి వయసు ప్రస్తుతం 21 సంవత్సరాలు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఇన్నాళ్లూ వయసు అడ్డంకిగా ఉండటంతో ఆగిన సెంథిల్ ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. 
 
కొన్ని రోజుల క్రితం భార్యకు విడాకులిచ్చేందుకు సిద్ధపడిన సెంథిల్ ఆమెకు విడాకుల నోటీసు పంపి తను ఇష్టపడిన రేఖతో వెళ్లిపోయాడు. 
 
ఈ పరిణామంతో షాకయిన సెంథిల్ భార్య మహేశ్వరి పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.