నీట్ ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు అనుమతివ్వాలి : కేంద్రం
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)ను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించేలా అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ ఓ పిటీషన్ దాఖలు చేశారు. నీట్ను ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిర్వహించడం వల్ల గ్రామీణ విద్యార్థులు నష్టపోతారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అదేసమయంలో ప్రాంతీయ భాషల్లో నీట్ నిర్వహించేందుకు తాము సిద్ధమేనని సీబీఎస్ఈ ఇప్పటికే కోర్టుకు తెలిపిన విషయం తెల్సిందే. మరోవైపు ఈ ఏడాదికి నీట్ నిర్వహణ నుంచి రాష్ట్రాలకు మినహాయింపునివ్వాలని గుజరాత్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తులను పరిశీలించేందుకే సుప్రీంకోర్టు నూతన ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది.