శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (08:45 IST)

#himachalpradeshelections: బ్యాలెట్ సమరం .. పోలింగ్‌ షురూ

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకుగానూ.. 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ బందోబస్తు నిమిత్తం 11500, జవాన్లు, 6400 హోం గార్డ్స్, 65 కంపెనీల పారమిలటరీ బలగాలు భద్రతకు కేటాయించారు.
 
కాగా, మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేస్తున్నాయి. అలాగే, సీపీఎం 14 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుండగా, ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి 187మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
 
ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ - బీజేపీ పార్టీలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాయి. కాంగ్రెస్‌ అవినీతిని ఎండగడుతూ ప్రధాని మోడీ ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ప్రచారంలో నోట్లరద్దు, జీఎస్టీలపై కేంద్రాన్ని టార్గెట్‌ చేశారు. గుజరాత్‌ మోడల్‌ విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున సీఎం అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ దుమాల్‌ను బీజేపీ ప్రకటిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ పైనే గంపెడాశలు పెట్టుకుంది. 
 
పర్వత రాష్ట్రంలోని మొత్తం 68 నియోజకవర్గాల్లో బరిలో 338 అభ్యర్థులు నిలిచారు. వీరిలో మహిళలు 19 మందే ఉండటం గమనార్హం. మొత్తం 50.25 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 7525 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధర్మశాల నియోజకవర్గంలో అత్యధికంగా 12 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అత్యల్పంగా ఝన్‌దుట ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానంలో ఇద్దరే పోటీలో ఉన్నారు. మొత్తం నియోజకవర్గాల్లో ఒకే విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు.