గర్భిణికి హెచ్ఐవీ పాజిటివ్.. పట్టించుకోని డాక్టర్లు.. కడుపులోనే శిశువు మృతి
వైద్యం కోసం వచ్చిన నిండు గర్భిణికి హెచ్ఐవీ పాజిటివ్ ఉందని వైద్యం చేయాల్సిన డాక్టర్లు పట్టించుకోలేదు. నిండు గర్భిణిని పట్టించుకునేవారు లేకపోవడంతో కడుపులోనే బిడ్డ చనిపోయాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నా
వైద్యం కోసం వచ్చిన నిండు గర్భిణికి హెచ్ఐవీ పాజిటివ్ ఉందని వైద్యం చేయాల్సిన డాక్టర్లు పట్టించుకోలేదు. నిండు గర్భిణిని పట్టించుకునేవారు లేకపోవడంతో కడుపులోనే బిడ్డ చనిపోయాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..నెలలు నిండిన భార్యని ప్రసవానికి 50కి.మీ. దూరాన ఉన్న బరేలీలోని ఒక ఆసుపత్రికి ఆమె భర్త తీసుకువెళ్లాడు.
వైద్యం అందిచాల్సిన డాక్టర్లు ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారు. అతను ఎంత ప్రాధేయపడినా వైద్యం చేయమని వేరే ఆసుపత్రికి తీసుకుపొమ్మని డాక్టర్లు తేల్చిచెప్పేశారు. అర్ధరాత్రి సమయంలో చేసేది లేక దిక్కుతోచని స్థితిలో భార్యను తీసుకుని అక్కడి నుంచి మరో ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు వెంటనే సిజేరియన్ చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
సకాలంలో వైద్యం అందక శిశువు చనిపోయింది. ముందే వైద్యం చేసి ఉంటే బిడ్డ బతికేదని, తమ బిడ్డ చనిపోవడానికి కారణం ఆ ఆసుపత్రి యాజమాన్యమే అని దంపతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా అధికారులు ఆదేశించారు.