1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (11:01 IST)

అనుమానం పెనుభూతమైంది.. భార్యను ముక్కలుగా నరికేసిన భర్త

ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ హోటల్ గదిలో మహిళ దారుణ హత్యకు గురైన కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కట్టుకున్న భర్తేనని తేలింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను ఒక లాడ్జీ గదికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. తాను పోలీసులకు చిక్కకుండా, మృతురాలిని గుర్తుపట్టకుండా ఉండేందుకు వీలుగా తల, చేతిని వేరు చేశాడు. ఆ తర్వాత అక్కడ పారిపోయినట్టు పోలీసుల విచారణలో తేలింది. 
 
ఇటీవల యూపీలోని పన్వేల్‌కు చెందిన పూనమ్, రాంపాల్ అనే వారికి యేడాది క్రితం వివాహమైంది. పూనమ్ స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. వివాహమైన తర్వాత వీరిద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇది పెనుభూతమైంది. 
 
ఈ క్రమంలో గత ఆదివారం భార్యను తీసుకుని రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న లాడ్జీకి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరినట్టు తెలుస్తోంది. దీంతో నిగ్రహం కోల్పోయిన భర్త కసాయిగా మారిపోయాడు. భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఈ కేసులో తాను చిక్కకుండా ఉండేందుకు ఆమె తలను, పచ్చబొట్టు ఉన్న చేతిని నరికేశాడు. తర్వాత ఆమెను వివస్త్రను చేసి అక్కడ నుంచి పారిపోయాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు... లాడ్జికి 50 కిలోమీటర్ల దూరంలో ఓ లేడీ హ్యాండ్ బ్యాగ్‌ను గుర్తించారు. అందులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలు పూనమ్‌గా గుర్తించారు. ఆ తర్వాత భర్తను గాలించి అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.