శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2015 (14:20 IST)

ప్రజాస్వామ్యం ఏ ఒక్కరి ఇష్టాయిష్టాలకో పరిమితం కారాదు : నరేంద్ర మోడీ

ప్రజాస్వామ్యం ఏ ఒక్కరి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడవదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యం ఎన్నికలకు, ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతివారూ తాము దేశప్రగతికే పని చేస్తున్నామన్న భావన కలిగి ఉండాలని ఆయన ఉద్బోధించారు. 
 
'ప్రజాస్వామ్యానికి సంబంధించి మా నిర్వచనం ఎన్నికలకు, ప్రభుత్వానికి మాత్రమే అది పరిమితం కాదనే. ప్రజాస్వామ్యం ప్రజల భాగస్వామ్యంతో బలపడుతుంది' అని ఆయన గురువారం జాగరణ్ న్యూస్ నిర్వహించిన జాగరణ్ వేదిక నుంచి ప్రసంగిస్తూ పేర్కొన్నారు. 
 
'భారతదేశ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రజా ఉద్యమంగా చేయాలని భావిస్తున్నాను. ప్రతివారు తాము దేశ ప్రగతికి కృషి చేస్తున్నామని భావించాలి' అని అన్నారు. మహాత్మా గాంధీ స్వాతంత్య్రోద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి దాని రూపురేఖలను పెద్ద ఎత్తున మార్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
 
అలాగే, ప్రజాస్వామ్యం అనేది ఏ ఒక్కరి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడవదన్నారు. సభా కార్యక్రమాలకు కాంగ్రెస్ కలిగిస్తున్న ఆటంకాలను అన్యాపదేశంగా ప్రస్తావిన్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ప్రజాసామ్యం ముందు రెండు ప్రమాదాలున్నాయని, వాటిలో ఒకటి మన్‌తంత్ర (ఒకరి ఇషాయిష్టాలకు అనుగుణంగా నడవడం) కాగా రెండోది ధన తంత్ర (అర్థ బలం) అని అన్నారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే ఎన్నో బిల్లులు పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలగడం వల్ల నిలిచిపోయాయని అన్నారు.