శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (04:50 IST)

ఇస్రో గ'ఘన' ప్రయాణం: మరి కొద్ది గంటల్లో 104 ఉపగ్రహాలతో కొత్త చరిత్రకు నాంది

ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను పంపిన తొలిదేశంగా చరిత్ర సృష్టించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరికొద్ది గంటల్లో గ'ఘన' ప్రయాణానికి సర్వం సిద్ధం చేసుకోంటోంది. ప్రపంచస్థాయి ప్రయోగాలకు వేదికైన షార్‌ నుంచి, గెలుపు గుర్రం పీఎస్‌ఎల్‌వీ సీ 37 రాకెట్

ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను పంపిన తొలిదేశంగా చరిత్ర సృష్టించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరికొద్ది గంటల్లో గ'ఘన' ప్రయాణానికి సర్వం సిద్ధం చేసుకోంటోంది. ప్రపంచస్థాయి ప్రయోగాలకు వేదికైన షార్‌ నుంచి, గెలుపు గుర్రం పీఎస్‌ఎల్‌వీ సీ 37 రాకెట్‌ ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. రికార్డు స్థాయిలో ఒకే ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను గ‘ఘన’ ప్రయాణానికి సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 9.28 గంటలను ఇందుకు ముహూర్తంగా నిర్ణయించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలను నింగికి పంపిన దేశంగా భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది. ఇస్రో ఘన చరిత మరోసారి ప్రపంచానికి తేటతెల్లమవుతుంది. 
 
అంతరిక్ష ప్రయోగాల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్  స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ ను మంగళవారం ఉదయం 5.28 గంటలకు ప్రారంభించారు. దాదాపు 28 గంటల కౌంట్‌డౌన్ నంతరం పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ప్రయోగం నాలుగు దశల్లో, 28.42 నిమిషాల్లో పూర్తయ్యేలా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది పీఎస్‌ఎల్‌వీకి 39వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా మూడు స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు.
 
714 కిలోల బరువైన కార్టోశాట్‌ 2డీ, ఇస్రో నానో శాటిలైట్స్‌ అయిన ఐఎన్ ఎస్‌–1ఏ, ఐఎన్ ఎస్‌–1బీలు స్వదేశీ ఉపగ్రహాలు. విదేశీ ఉపగ్రహాల్లో 96 అమెరికాకు చెందినవి కాగా, ఇజ్రాయెల్, కజకిస్తాన్ , నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఏఈ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం కూడా ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటున్నాయి. కార్టొశాట్‌ 2డీ ఉపగ్రహం రిమోట్‌ సెన్సింగ్‌ సేవలను ఐదేళ్ల పాటు అందిస్తుంది. 
 
ఈ ప్రయోగం విజయవంతమైతే ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను పంపిన తొలిదేశంగా భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది. గతంలో రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకే రాకెట్‌తో 37 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించింది. జూన్ 2015లో ఇస్రో సైతం ఒకే ప్రయోగంలో 23 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.