శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (18:14 IST)

డాన్సింగ్ డాల్ పేరుతో రూ.కోట్లు స్వాహా... ఎక్కడ?

అదేదో సినిమాలో చెప్పినట్లు... చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు... ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ మోసపోయేవాళ్లు ఉన్నంతవరకు మోసగాళ్లకేమీ తక్కువ ఉండటం లేదు అనేది ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే వస్తోంది. తాజాగా రేడియోధార్మిక పదార్థంపై పెట్టుబడి పెట్టి వందల కోట్ల రూపాయలు సంపాదించవచ్చునని చెప్తూ ప్రజలను మోసం చేస్తోందో ముఠా. ఈ ముఠా నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ ముఠా గుట్టుని రట్టు చేసిన రాజస్థాన్‌లోని జయపుర పోలీసులు 18మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
 
డీఆర్‌డీవో గుర్తింపు పొందిన అరుదైన రేడియోధార్మిక పదార్థంతో తయారు చేసిన ‘‘డాన్సింగ్‌ డాల్‌’’ తమ దగ్గర ఉందని అమాయకులను నమ్మించే ఈ ముఠా సభ్యులు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఈ బొమ్మను అధిక ధరకు కొనుగోలు చేస్తుందని ఆశ పెట్టడంతో వీరి మాటలు నమ్మిన పుణెకు చెందిన ముగ్గురు మోసపోయి ఏకంగా రూ.ఏడుకోట్లు మొత్తాన్ని సమర్పించేసుకున్నారు. 
 
మోసపోయినవారిలో ఒకరు జయపుర జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ముంబయిలో ‘‘రెన్‌సెల్‌ ఇండియా’’ అనే నకిలీ సంస్థను నడుపుతున్న గణేశ్‌ ఇంగోలే ఆధ్వర్యంలో ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తోందని తెలిసింది. అంతర్జాతీయ అణు సంస్థలతో అనుబంధం ఉందంటూ గణేశ్‌, అతని భాగస్వామి సత్యనారాయణ ప్రజల్ని ముంచేసారని తేల్చారు. కొనుగోలు చేసే ముందు రేడియోధార్మిక పదార్థాన్ని పరీక్ష చేయించడానికి రూ.70లక్షల చొప్పున వసూలు చేసారని విచారణలో వెల్లడైంది.