సోమవారం, 28 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2024 (11:47 IST)

కాన్పూర్‌లో మాయమైన మహిళ - మేజిస్ట్రేట్ బంగ్లా సమీపంలో శవమై కనిపించింది..

woman
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో మాయమైన ఓ మహిళ.. ఆ జిల్లా మేజిస్ట్రేట్ బంగళాకు సమీపంలో శవమై కనిపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలను పరిశీలిస్తే, నాలుగు నెలల క్రితం అదృశ్యమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త భార్య మృతదేహం తాజాగా కాన్పూరు జిల్లాలోని మేజిస్ట్రేట్ బంగళా సమీపంలో లభ్యమైంది. 
 
ఈ కేసులో కాన్పూరులోని రాయుర్వా ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్‌ను అనుమానించి అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించడంతో ఆమె హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను తానే చంపి పూడ్చిపెట్టానని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.
 
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ ఈ యేడాది జూన్ 24వ తేదీన అదృశ్యమైంది. జిమ్ ట్రైనర్‌కు పెళ్లి నిశ్చయమైనట్టు తెలియడంతో జీర్ణించుకోలేకపోయిన ఆమె అతడిని కలిసేందుకు జిమ్‌కు వెళ్లింది. 
 
ఆ తర్వాత ఇద్దరూ కలిసి కారులో బయటకు వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పెళ్లి విషయమై వాగ్వివాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన నిందితుడు ఆమె మెడ వెనుక బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెను హత్య చేసి పూడ్చిపెట్టేశాడు.
 
అతడు ఆ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడంతో కేసును ఛేదించడం కష్టమైందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసు బృందాలను పూణే, ఆగ్రా, పంజాబ్ పంపారు. కాగా, ఆ సమయంలో బాధిత మహిళ ధరించిన ఆభరణాలను నిందితుడు తీసుకున్నదీ, లేనిదీ నిర్ధరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.