1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

లక్కీ డ్రాలో రూ.45 కోట్లు గెలుచుకున్న భారతీయుడు.. ఎక్కడ?

Cash
ఒక భారతీయుడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడుగా మారిపోయాడు. కేరళ చెందిన ఓ వ్యక్తికి ఏకంగా రూ.45 కోట్ల లాటరీ తగిలింది. కేరళకు చెందిన శ్రీజు ఏకంగా రూ.45 కోట్లను లక్కీ డ్రాలో గెలుచుకున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బుధవారం నిర్వహించిన ‘మహ్‌జూజ్ సాటర్ డే మిలియన్స్ డ్రా'లో ఈ భారీ మొత్తాన్ని గెలుచుకున్నాడు. 39 ఏళ్ల శ్రీజు ఒక చమురు - గ్యాస్ పరిశ్రమలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇంతపెద్ద లక్కీ డ్రా గెలవడాన్ని నమ్మలేకపోతున్నానంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. 
 
కారులో వెళ్తున్న సమయంలో మహూజ్ అకౌంట్‌ను పరిశీలించానని, తన కళ్లతో చూసింది ఏమాత్రం నమ్మలేకపోయానని వివరించాడు. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డానని, నిర్ధారణ కోసం మహ్‌జూజ్ లక్కీ డ్రా నుంచి ఫోన్ కోసం ఎదురుచూశానని, నిజమని తెలిసి ఆశ్చర్యపోయానని శ్రీజు వెల్లడించారు.
 
కాగా శ్రీజు 11 ఏళ్ల నుంచి యూఏఈలో పనిచేస్తున్నాడు. అయితే అక్కడ సంపాదించిన డబ్బుతో కేరళలో ఇల్లు కూడా కట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రే అతడి తలరాత మారిపోయింది. కాగా గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఈ విధంగా లక్కీ డ్రాలు, లాటరీలు గెలవడం కొత్తేమీ కాదు. గత శనివారం యూఏఈలోని కేరళకు చెందిన శరత్ శివదాసన్ సుమారు రూ.11 లక్షల లాటరీని గెలుచుకున్నాడు. ఇదే డ్రాలో ముంబైకి చెందిన మనోజ్ భావార్ అనే మరో వ్యక్తి కొంత డబ్బును గెలుచుకున్నాడు.