శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 15 జనవరి 2019 (12:08 IST)

ప్రయాగ్‌‌రాజ్ అర్థకుంభమేళా ప్రారంభం.. తరలివచ్చిన అఘోరాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌ అర్థకుంభమేళా మంగళవారం అట్టహాసంగా ప్రారభమైంది. అపూర్వ ఆధ్యాత్మిక సంగమం.. వేల సంవత్సరాల విశ్వాసానికి తార్కాణం... ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ధార్మిక సమ్మేళనం... కోట్లాదిమంది ఒక్కచోట చేరే అద్భుత ఘట్టం.. పవిత్ర స్నానాలు ఆచరించే పుణ్య సమయం.. అదే కుంభమేళా. 
 
ఈ కుంభమేళాకు నాగ సాధువుల మంగళ స్నానాలతో 2019, జనవరి 15వ తేదీ మంగళవారం ప్రారంభమైంది. కుంభమేళా 8 వారాల పాటు(మార్చి 4వ తేదీ) సాగనుంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని నలు మూలల నుంచి సాధువులు భారీ ర్యాలీగా ప్రయాగ చేరుకున్నారు. 10 అఖాడాలకు చెందిన స్వాములు స్నానాలు ఆచరించారు. 
 
ముఖ్యంగా, కుంభమేళా... సనాతన భారతీయ జీవనశైలికి, మన సాంస్కృతిక వారసత్వానికి, సంప్రదాయాలకు అద్దం పడుతోంది. 8 వారాల పాటు జరిగే ఈ మేళాకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 2800 కోట్ల రూపాయల వ్యయంతో ఓ తాత్కాలిక ఆధ్యాత్మిక నగరాన్నే నిర్మించింది. ఆధ్యాత్మిక, రాజకీయ, పర్యాటక సంగమమైన ఈ మహా ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు.
 
49 రోజులపాటు జరిగే అర్థ కుంభమేళాకు యోగి అదిత్యానాథ్ ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. 192 దేశాల నుంచి 12 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. తొలి రోజు 30 లక్షల మంది స్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా. 2,800 కోట్లతో దాదాపు 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, గంగా నది ఒడ్డులను కలుపుతూ 22 వంతెనలు నిర్మించారు.