శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 21 మే 2015 (16:47 IST)

మాంఝీజీ.. జనతా పరివార్‌లో చేరండి : లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపు

బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీకి జనతా పరివార్‌ ఆహ్వానం అందింది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆరు ప్రధాన పార్టీలు కలిసి ఒకే వేదికపైకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ కూటమికి జనతా పరివార్ అనే పేరు పెట్టారు. ఇందులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, నితీశ్ కుమార్‌కు ఒకప్పుడు రాజకీయ సన్నిహితుడైన జితన్ రాం మాంఝీని జనతా పరివార్‌లో చేరాలంటూ పిలుపు వచ్చింది.
 
ఈ మేరకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించారు. ఇదే అంశంపై ఆయన గురువారం ఓ ఆంగ్ల టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'బీజేపీకి వ్యతిరేకంగా మేమంతా పార్టీల వేదికగా ఐక్యమవుతున్నాం. ఇందులో మాంఝీ, ఇతరులు కూడా మాతో కలసి రావొచ్చు' అని లాలూ పేర్కొన్నారు. 
 
వచ్చే ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీని ఎలాగైనా ఎదుర్కోవాలని జనతా పరివార్ లోని నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కావల్సిన బలాన్ని కూడగట్టుకునే యత్నం పరివార్ చేస్తుందని, అందులో భాగంగానే మాంఝీని ఇలా ఆహ్వానించారని పలువురు అంటున్నారు. మరీ పిలుపుకు మాంఝీ ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.