శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 28 అక్టోబరు 2020 (12:25 IST)

ఆగస్టులో ప్రేమ పెళ్లి, అక్టోబరులో హత్య, భార్య గొంతు కోసిన భర్త

ఇద్దరి మనసులు కలిశాయి. దాంతో విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లకుండానే యువతిని పెళ్లి చేసుకున్నాడతను. పైగా ఆమెను గోప్యంగా వేరేచోటకి తరలించి కాపురం చేసాడు. ఉన్నట్లుండి ఏమయ్యిందో తెలియదు కానీ బుధవారం రాత్రి భార్య గొంతు కోసి హత్య చేసాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత నేరుగా వెళ్లి పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జావ్రా కాంపౌండ్ పరిధిలో హర్ష-అన్షులు ఇద్దరూ ఒకే చోట పనిచేసేవారు. ఇక్కడే ఇద్దరూ స్నేహితులు అయ్యారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.

దాంతో ఆమె మెడలో మూడుముళ్లు వేసి మూడు నెలల క్రితం కలిసి జీవించడం ప్రారంభించారు. ఎవరికీ చెప్పకుండా ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అన్షు తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా అతడితో సంతోషంగా జీవించడానికి వచ్చేసింది. తమ కుమార్తె అకస్మాత్తుగా కనిపించకపోయేసరికి తప్పిపోయిందంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేసారు.
 
ఆమె ఆచూకి తెలుసుకునేలోపే బుధవారం రాత్రి హర్ష తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య అన్షును కత్తితో గొంతు కోసి హతమార్చడం సంచలనంగా మారింది. తన భార్యను హత్య చేసానంటూ అతడు పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. ఆమెను ఎందుకు హత్య చేసాడన్నది తెలియాల్సి వుంది. కాగా తమ కుమార్తె మరణవార్త విని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.