1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (16:07 IST)

75 మందిని పెళ్లాడిన నిత్య పెళ్లి కొడుకు.. వ్యభిచార రొంపిలోకి 200 మంది మహిళలు

ఏకంగా 75మందిని పెళ్లి చేసుకోవడమే కాదు.. అతని నేరాల చిట్టా చిన్నదేమీ కాదు.. అతడు మహిళలను అక్రమంగా రవాణా చేశాడు. ఇలా తవ్విన కొద్ది నివ్వెరపోయే విషయాలు బయటపడుతున్నాయి. బంగ్లాదేశ్‌ నుంచి మహిళలను భారత్‌లోకి అక్రమంగా రవాణా చేయడంతోపాటు, వివాహం చేసుకున్న నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇటీవల ఓ సెక్స్‌ రాకెట్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచార కూపం నుంచి 21 మంది యువతులను రక్షించారు.
 
ఈ కేసులో ప్రధాన నిందితుడైన మునిర్‌ గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. బంగ్లాదేశ్‌లోని జాసుర్‌కు చెందిన మునిర్‌ అలియాస్‌ మునిరుల్‌.. ఆ దేశానికి చెందిన యువతులను ఉపాధి నెపంతో భారత్‌లోకి అక్రమ రవాణా చేసేవాడు. పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ మీదుగా ఈ అక్రమ రవాణా వ్యవహారం సాగేది.
 
ఈ క్రమంలో సరిహద్దులోని అధికారులకు మునిర్‌ రూ.25వేల చొప్పున లంచం ఇచ్చేవాడు. అనంతరం బంగ్లాదేశ్‌ యువతులను ముంబయి, కోల్‌కతా ప్రధాన కేంద్రాలుగా మునిర్‌ వ్యభిచారంలోకి దింపేవాడని పోలీసులు తెలిపారు. 
 
ఇలా 200 మంది యువతులను భారత్‌లోకి అక్రమ రవాణా చేసినట్టు చెప్పారు. మరోవైపు, తాను ఇప్పటివరకు 75 మందిని వివాహం చేసుకున్నట్టు మునిర్‌ చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.