1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 మే 2020 (13:53 IST)

క్వారంటైన్ గదిలో భర్త.. తాళం వేసి ప్రియుడితో లేచిపోయిన భార్య

కరోనా వైరస్ సోకిన భర్త క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. అతన్ని బాగా చూసుకోవాల్సిన భార్య.. భర్త నివసించే క్వారంటైన్ గదికి తాళం వేసి.. తన ప్రియుడితో లేచిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛత్తర్ పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తర్ పూర్ జిల్లా ముందేరి గ్రామానికి చెందిన జంట పొట్ట చేతపట్టుకని ఢిల్లీకి వలస కూలీలుగా వచ్చారు. వీరు ఢిల్లీ ఉంటూ భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. అయితే, భార్యాపిల్లలు ఏడాదిన్నర క్రితం సొంత గ్రామం ముందేరికి వెళ్లిపోయారు. భర్త మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఆమెకు ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఇదిలావుంటే, లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడంతో భర్త ఇటీవలే సొంతూరుకు వచ్చాడు. ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ అని తేలింది. అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. దీంతో ఆయన ఇంట్లోని పై అంతస్తులో ఉండసాగాడు. 
 
భార్యాపిల్లలు మాత్రం కింది‌ ఫ్లోర్‌లో ఉంటున్నారు. అయితే, తన భర్త ఇంటికి రావడంతో తన ప్రియుడిని ఇక కలవలేనేమోనని భయపడిన ఆమె.. భర్తను గదిలోనే ఉంచి తాళం వేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. బయటి నుంచి తాళం వేసి ఉన్న విషయాన్ని గుర్తించిన భర్త ఇతరుల సాయంతో బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించాడు.