కన్యత్వ పరీక్షల్లో భార్య విఫలమైందనీ గంటల్లో విడాకులిచ్చిన భర్త.. వత్తాసు పలికిన పంచాయతీ పెద్దలు
ఈ రోజుల్లో తల్లితండ్రులకు ఆడపిల్ల పెళ్లి చేసేవరకు ఒక ఇబ్బంది. పెళ్లి అయ్యాక మరో ఇబ్బంది అన్నట్టుగా మారిపోయింది. పెళ్లయ్యాక తమ కూతురిని అల్లుడు ఎలా చూసుకుంటాడనే బాధ అధికంగా ఉంటుంది. మగవాళ్ళు ఆ విధంగా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను జీవితాంతం కంటికి రెప్పలా చూసుకోవాల్సిన మగాళ్లు మృగాళ్లుగా మారి వారిని హింసిస్తున్నారు.
తాజాగా, మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కన్యత్వ పరీక్షలో తన భార్య విఫలమైందని ఆరోపిస్తూ వరుడు పెళ్లి చేసుకున్న కొన్ని గంటల్లోనే పెళ్లిని రద్దు చేశాడు. చట్టాలను సైతం ప్రక్కనబెట్టి కాప్ పంచాయతీ పెద్దలు తమ ఇష్టానుసారం(ఆచారం) తీర్పును ప్రకటించి వరుడికే మద్దతుగా నిలిచారు. నాసిక్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి.
గత నెల 21వ తేదీన ఓ యువతీ యువకుడికి వివాహం జరిగింది. పెళ్లి మరుసటి రోజున శోభన తంతు ఏర్పాటు చేశారు. కుల పంచాయతీ పెద్దలు వరుడికి ఒక తెల్లని బెడ్షీట్ను ఇచ్చి శోభనం రాత్రి మరుసటి రోజు తిరిగి దాన్ని తమకు చూపించాల్సిందిగా ఆదేశించారు. వరుడు అదేవిధంగా చేశాడు. అయితే, తెల్లని బెడ్షీట్పై రక్తపు మరకలు లేవు. దీంతో వధువు కన్యకాదని అభిప్రాయానికి వచ్చిన వరుడు పెళ్లిని రద్దు చేసుకోగోరాడు. వరుడి ఇష్టానుసారం పంచాయతీ పెద్దలు పెళ్లిని రద్దు చేశారు.