శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (10:46 IST)

గర్భిణి కుమార్తెని చంపేసిన తండ్రి... ఎలాగంటే..?

తాగుడుతో ఎన్నో కాపురాలు మునిగిపోయాయి. తాజాగా ఓ తండ్రి నిండుగర్భిణిని పొట్టనబెట్టుకున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని తళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డెంకణీకోట తాలూకా అంచెట్టి సమీపంలోని కరడికల్‌ గ్రామానికి చెందిన అరుణాచలం కూతురు వెంకటలక్ష్మి (20)కి కోలారు జిల్లా మాలూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్‌తో నాలుగు నెలల క్రితం పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. 
 
పుట్టింటిలో ఉగాదిని జరుపుకొనేందుకు గత రెండు రోజుల క్రితం కరడికల్‌ గ్రామానికి వచ్చింది. బుధవారం రాత్రి అతిగా మద్యం తాగి అరుణాచలం భార్యతో గొడవ పడ్డాడు. అరుణాచలం తీవ్ర ఆవేశం చెంది ఇంట్లో దాచిన నాటు తుపాకీతో భార్యను కాల్చేందుకు యత్నించాడు. ఈ సమయంలో అడ్డుకొనేందుకెళ్లిన కూతురు వెంకటలక్ష్మిపై తుపాకీ గుండు పేలింది. 
 
వెంకటలక్ష్మి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. తండ్రి తుపాకీ పడేసి పరారయ్యాడు. డెంకణీకోట డీఎస్పీ సంగీత, తళి పోలీసులు చేరుకొని శవాన్ని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంచెట్టి పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న అరుణాచలం కోసం గాలిస్తున్నారు.