శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (12:50 IST)

కన్నతల్లి నిరాకరించింది.. అత్త కనికరించింది.. కోడలికి ప్రాణదానం...

సాధారణంగా అత్తల వేధింపులు భరించలేక ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. వరకట్న వేధింపుల పేరుతో తమ కోడళ్ళకు నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో ఆ అత్త మాత్రం తన కోడలికి ప్రాణదానం చేసింది.

సాధారణంగా అత్తల వేధింపులు భరించలేక ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. వరకట్న వేధింపుల పేరుతో తమ కోడళ్ళకు నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో ఆ అత్త మాత్రం తన కోడలికి ప్రాణదానం చేసింది. నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లే కుమార్తె ప్రాణాలు కాపాడేందుకు ముందుకురాలేదు. కానీ ఆ అత్త మాత్రం ముందుకు వచ్చి కోడలి ప్రాణాలు కాపాడింది. ఇపుడు ఆ అత్తపై సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు.. స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌ రాష్ట్రంలోని బాడ్మేర్‌కు చెందిన గాంధీనగర్ నివాసి సోనికా. ఈమె కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మెడికేషన్ సపోర్టుతో జీవిస్తోంది. ఈ నేపథ్యంలో సోనికాకు కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచన చేశారు. 
 
అయితే, సోనికాకు కిడ్నీ ఇచ్చేందుకు ఆమె కన్నతల్లితో పాటు సోదరుడు కూడా ముందుకురాలేదు. కానీ, అత్త గోనీదేవి మాత్రం పెద్ద మనసుతో తన కోడలికి ప్రాణదానం చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు గోనీదేవి కిడ్నీ సరిపోతుందని నిర్ధారించారు. 
 
ఆ తర్వాత అత్త కిడ్నీ దానం చేయగా, దాన్ని కోడలు సోనికాకు వైద్యులు అమర్చారు. ఫలితంగా సోనికా సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంది. ఈ సంగతి తెలుసుకున్న స్థానికులు అత్త గోనీ‌దేవిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.