శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (05:09 IST)

ప్రధాని గారూ! మాస్కులు, వెంటిలేటర్లు ఉన్నాయా?: రాహుల్

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని సంభోదిస్తూ.. వరల్డ్ హెల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం సరిపడినన్ని వెంటిలేటర్లు, మాస్కులను ప్రజలకు అందుబాటులో ఉంచారా అని ప్రశ్నించారు.

ఇప్పుడు దేశంలో ఉన్న వెంటిలేటర్లు ఏ మూలకూ సరిపోవని పేర్కొన్న రాహుల్…మార్చి 19 వరకూ వెంటిలేటర్ల దిగుమతికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు.

అదేమన్నా పండుగా?
అత్యవసర సేవలందించే వారికి కృతజ్ఞతగా చప్పళ్లు మోగించడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు ఆ కార్యక్రమాన్ని ఓ పండగలా చేశారని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ధ్వజమెత్తారు.

కోవిడ్ ఓ వైపు విజృంభిస్తున్నా సరే, చప్పళ్లు కొట్టే కార్యక్రమాన్ని ప్రజలు ఓ పండగలా చేసి, తీవ్రతను చెడగొట్టారని, ఇప్పుడు లాక్‌డౌన్‌ను ప్రజలు ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని ప్రధాని అంటే లాభమేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు.

‘‘లాక్‌డౌన్‌ను ప్రజలు ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని ఇప్పుడు ప్రధాని అంటున్నారు’’ అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అంతేకాకుండా ‘‘ఇంతటి తీవ్రమైన, భయానక వాతావరణాన్ని ఓ పండుగ వాతావరణంలా సృష్టించేశారు.

ఇదంతా మీ వల్లే. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటే ప్రజలు కూడా అంతే తీవ్రంగా ప్రతిస్పందించేవారు’’ అని సంజయ్ రౌత్ తీవ్రంగా విమర్శించారు.