శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (10:32 IST)

ధైర్యం, స్థైర్యం కోల్పోవద్దు..శాస్త్రవేత్తలతో ప్రధాని

విజయపుటంచుల్లో సిగ్నల్‌ కట్‌ కావడంతో ధైర్యం, స్థైర్యం కోల్పోవద్దని శాస్త్రవేత్తలందరికి మోదీ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి ఘట్టంలో ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ తెగిపోయింది. ఈ సందర్భంగా బెంగళూరులోని ఇస్రో కేంద్ర్రం నుంచి ప్రధాని మోదీ చంద్రయాన్-2 అంశంపై జాతినుద్దేశించి ప్రసంగించారు.

భారత విజయం కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నించారని ప్రధాని మోదీ అన్నారు. శాస్త్రవేత్తల మానసిక స్థితిని అందరూ అర్థం చేసుకోగలరని అని ఆయన అన్నారు. భారత శాస్త్రవేత్తల కృషి ఎప్పటికీ వమ్ముకాదని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్-2 ప్రయోగంలో ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ తెగిపోవడంతో శాస్త్రవేత్తలు ఎంత బాధపడుతున్నారో తెలుసని అన్నారు.

ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఎన్నో నిద్రలేని రాత్రులు వారు గడిపి ఉంటారని ఆయన అన్నారు. చంద్రయాన్-2 విజయవంతం కావాలని శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నం చేశారో వాళ్ల కళ్లే చెబుతున్నాయని మోదీ కొనియాడారు. భారతీయుల కలలను సాకారం చేసుకునేందుకు వారు ఎంతో ప్రయత్నం చేశారని ఆయన అన్నారు.

ఇలాంటి సమయంలో దేశం మీ వెంటే ఉంటుందని ఆయన భరోస ఇచ్చారు. భారతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారని మోదీ గుర్తుచేశారు. శాస్త్రవేత్తల కుటుంబాలకు సెల్యూట్ అంటూ వారి కృషి ఎనలేనిది అని ఆయన అన్నారు.

'శాస్త్రవేత్తల బాధను నేనూ పంచుకుంటున్నా..  దేశం పట్ల శాస్త్రవేత్తలకు ఉన్న నిబద్ధత ఎంతో గర్వించదగింది' అని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రయాన్-2తో చంద్రుడికి దగ్గరగా వెళ్లాం..  భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

చంద్రయాన్-2 ఎంత మాత్రం వెనుకడుగు కానే కాదని ఆయన తెలిపారు. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు గర్వపడుతున్నాం అంటూ శాస్త్రవేత్తలు సంతోషించే మరెన్నో అవకాశాలు మున్ముందు వస్తాయని మోదీ అన్నారు.