శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (16:34 IST)

ఇసుకాసురుడి అవతారమెత్తిన జగన్ : నారా లోకేశ్ ట్వీట్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు సంధించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇసుకాసురుడిగా అవతారమెత్తాడంటూ విమర్శలు గుప్పించారు. 
 
"జగన్ గారు భవననిర్మాణ కార్మికులను మింగేస్తున్నారు. కృత్రిమ ఇసుకకొరత, వైకాపా నాయకుల జేట్యాక్స్ వసూళ్లకు ఇద్దరు కార్మికులు బలైపోయారు. గుంటూరులో ఒకేరోజు బ్రహ్మాజీ, వెంకట్రావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. పండగపూట వాళ్ళ కుటుంబాల్లో విషాదం నింపారు కదా జగన్ గారు. 
 
మండపేటలో శ్రీనవ్య డెంగ్యూతో చనిపోయారు. ఆ బాధతో ఆమె భర్త చందు, కూతురు యోషిత ఆత్మహత్యకి పాల్పడిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దున్నపోతు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి.
 
ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా జగన్ గారు? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దోమల నివారణకు అంత ఖర్చా అని ఏడ్చారు. ఇప్పుడు మీ తుగ్లక్ నిర్ణయాలకు ప్రజలు బలైపోతున్నారు. రాష్ట్రంలో విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు చనిపోతున్నా మీలో చలనం లేదు. 
 
ఐదు నెలల పాలనలోనే రాష్ట్రాన్ని ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్లిన అసమర్థ సీఎం జగన్ గారి జె-ట్యాక్స్‌తో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెదేపా హయాంలో రూ.10 వేలు ఉన్న లారీ ఇసుకను ఇప్పుడు వైకాపా ఇసుకాసురులు 40 వేల నుండి లక్ష రూపాయిలకు అమ్ముకుంటూ ప్రజలను లూటీ చేస్తున్నారు. 
 
ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో ఉండటానికి ఇష్టపడిన జగన్‌గారు, రూ.30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రాష్ట్రం నుండి బయటకు పంపాలని కక్ష కట్టారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులను అప్పుల ఊబిలోకి నెట్టేశారు.
 
'మంచి'ముఖ్యమంత్రి అనిపించుకుంటా.. అని జగన్ గారు అన్నట్టు నేను తప్పుగా విన్నా. ఆయన నిజమే చెప్పారు. జగన్ గారు అన్నది రాష్ట్రాన్ని 'ముంచే' ముఖ్యమంత్రి అవుతా అని. అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేసారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి చూస్తుంటే ఆందోళనగా ఉంది. ఇసుక కొనడానికి ప్రజల ఇల్లు గుల్ల అవుతుంటే, ఇసుక దోపిడీ ద్వారా వచ్చిన డబ్బు దాచుకోవడానికి ఇల్లు సరిపోక వైకాపా నాయకులు విదేశాలు వెళ్లి వస్తున్నారు.
 
జగన్ అండ్ కో ఇసుక నుండి తైలం తీయగల సమర్థులు అని మరోసారి నిరూపించుకున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇసుక ధరని రెండింతలు పెంచి ప్రజల నెత్తిపై గుదిబండ వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య ప్రజలకు దొరకని ఇసుక అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు తరలి పోతుంది అంటూ నారా లోకేశ్ ట్వీట్ల వర్షం కురిపించారు.