శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (15:00 IST)

వానలు కురుస్తుంటే నిర్మాణాలు జరుగుతాయా పచ్చకామెర్ల రోగుల్లారా? విజయసాయిరెడ్డి

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో టీడీపీ నేతలు వైకాపా ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. వర్షాలు పడుతుంటే నిర్మాణాలు ఎలా జరుగుతాయి పచ్చకామెర్ల రోగుల్లారా అంటూ మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన ట్వీట్ చేశారు. 
 
మళ్లీ తానే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు చంద్రబాబు కలవరిస్తున్నారని... తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న 2.20 లక్షల మంది ఓటర్లలో 1800 మంది తిరిగి ఆయనను అధికారంలోకి రావాలని కోరుకుంటున్న మాట నిజమేనని ఎద్దేవా చేశారు. పోలైన ఓట్లలో ఒక్క శాతం కూడా రాని పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడంటూ సెటైర్ వేశారు.
 
అంతేకాకుండా, 'ఎయిర్ పోర్టులో చిరు తిండ్ల ఖర్చు రూ.25 లక్షలు, ఒక్క రోజు ధర్నాకు రూ.10 కోట్లు... ఇలా చెప్పుకుంటే పోతే జాబితా చాలా పెద్దది వస్తుంది. కొందరు పదవిలో ఉన్నది అనుభవించడానికే అనుకుంటారు. ఇసుక కొరత అని ఆందోళనకు దిగుతున్న పచ్చ పార్టీ, బానిస పార్టీలు కోరుకునేదేమిటంటే... వర్షాలు కురవొద్దు. నదులు, వాగులు ఉప్పొంగకూడదు. రిజర్వాయర్లు నిండొద్దు. నదులన్నీ ఎండిపోయి ఇసుక రాశులు తేలి ఉంటే ఏ కొరతా ఉండదు. ఇటువంటి తిరోగమన ఆలోచనలున్న వాళ్లు భూమికి భారంకాక మరేమిటి?
 
అధికారంలో ఉన్నప్పుడు ఇసుకనే నమ్ముకున్నారు. అమ్ముకున్నారు. ఇప్పుడు దానిపైనే రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. తాత్కాలిక సమస్యపై ప్రజల్లో అలజడి సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చేస్తారట. కుండపోత వర్షాలు కురుస్తుంటే నిర్మాణాలెలా జరుగుతాయి పచ్చకామెర్ల రోగుల్లారా?' అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు.