బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

దాదాకు అభినందనలు... గొప్ప వ్యక్తి ప్రస్థానం మరింత గొప్పగా ఉంటుంది.. యూవీ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న బెంగాల్ దాగా సౌరవ్ గంగూలీకి భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభినందనలు తెలిపాడు. అంతేకాకుండా, దాదాను పొగడ్తల్లో ముంచెత్తేశాడు. ఓ గొప్ప వ్యక్తి ప్రస్థానం మరింత గొప్పగా ఉంటుందంటూ అభిప్రాయపడ్డాడు. 
 
ఇదే అంశంపై యూవీ ఓ ట్వీట్ చేస్తూ, "ఓ గొప్ప వ్యక్తి ప్రస్థానం మరింత గొప్పగా ఉంటుంద''ని అభిప్రాయపడ్డాడు. అయితే, కొన్నాళ్ల కిందట భారత క్రికెట్‌లో యోయో టెస్టు ప్రవేశపెట్టినప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యుంటే ఎంతో బాగుండేదని వ్యాఖ్యానించాడు. 
 
ఎందుకంటే, యోయో టెస్టుపై ఆటగాళ్ల దృక్కోణం నుంచి ఆలోచించగల వ్యక్తిగా గంగూలీ సరైన నిర్ణయం తీసుకుని ఉండేవాడని యువరాజ్ పేర్కొన్నాడు. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా సరికొత్త పదవి చేపడుతున్న సందర్భంగా దాదాకు యువీ శుభాకాంక్షలు తెలిపాడు.
 
మరోవైపు, బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించకముందే సౌరవ్ గంగూలీ ప్రాబల్యం విస్తరిస్తోంది. ఆయనకు భారత క్రికెట్‌లోని అన్ని వర్గాలు మద్దతిస్తున్నాయి. ఆటలో, మైదానంలో ఎంతో దూకుడుగా ఉండే గంగూలీ, రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ వ్యవహారాల్లో పరిణతితో కూడిన పాలనాదక్షత కనబరుస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇపుడు ఎవరూ ఊహించని విధంగా బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకోబోతున్నా, గంగూలీ సామర్థ్యంపై ఎవరికీ సందేహాల్లేవు. పలువురు భారత మాజీ క్రికెటర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సచిన్, సెహ్వాగ్, యూవీ, ద్రవిడ్ వంటి మేటి క్రికెటర్లు సంపూర్ణ మద్దతును తెలుపుతున్నారు.