'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ
'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత సైన్యం చేపట్టిన సైనిక చర్య వల్ల పాకిస్థాన్ను మోకాళ్లపై నిలబెట్టామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 'ఆపరేషన్ సిందూర్' ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను కేవలం 15 నిమిషాల్లోనే తుడిచి వేశామన్నారు.
ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7వ తేదీన చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో ఉగ్రవాదులకు చెందిన అతిపెద్ద 9 స్థావరాలను కేవలం 15 నిమిషాల్లో ధ్వంసం చేశామన్నారు పైగా, సిందూరం తుపాకీ మందుగా మారితో ఏం జరుగుతుందో శత్రువుకు చూపించామన్నారు. భారత్ మౌనంగా ఉంటుందని భావించిన దేశాలకు తగిన గుణపాఠం నేర్పామన్నారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ ప్రతీకార చర్యలో జైషె మొహ్మద్, లష్కర్ తోయిబా, హిజ్జుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
నా నరాల్లో రక్తం కాదు.. సిందూరం మరుగుతోంది అని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యంగా ఉంది. పహల్గాం దాడి తూటాలు 140 కోట్ల మందికి భారతీయుల గుండెల్లో గుచ్చుకున్నాయి. మేం ఉగ్రవాదపు గుండెల్లో దెబ్బకొట్టాం. ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్చనిచ్చింది. మన సాయుధ బలగాలు పాకిస్థాన్ను మోకాళ్లపై నిలబెట్టాయి అని ప్రధాని వివరించారు.