శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (21:56 IST)

కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం: ప్రధాని మోదీ

Modi
జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామన్నారు. కేంద్రం పరిధిలోనే ఇక పూర్తిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులకు 25 శాతం డోసులు ఇస్తామని ప్రధాని ప్రకటించారు. వ్యాక్సినేషన్ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 
 
రాష్టాలు వ్యాక్సిన్‌పై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రమే వ్యాక్సిన్లు కొని రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. దేశంలో ప్రస్తుతం ఏడు కంపెనీలు వివిధ దశల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మరో మూడు కంపెనీలు వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతోందని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌తో దేశ ప్రజల పోరాటం కొనసాగుతోందని అన్నారు. ఈ మహమ్మారి కారణంగా అనేక మంది ఆత్మీయులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక ప్రపంచం ఎప్పుడూ ఇలాంటి మహమ్మారిని చూడలేదని తెలిపారు. 
 
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్‌లో దేశంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగిపోయిందని.. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సర్వశక్తులను ఒడ్డిందని ప్రధాని మోదీ అన్నారు. తక్కువ సమయంలోనే మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుకున్నామని తెలిపారు. మహమ్మారి కట్టడి చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదల్లేదన్న ప్రధాని మోదీ.. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని మరోసారి స్పష్టం చేశారు.