1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 జూన్ 2025 (08:59 IST)

కులాంతర పెళ్లి చేసుకున్న యువతి.. 40 మందికి శిరోమండనం చేసిన గ్రామపెద్దలు!

marriage
ఒరిస్సా రాష్ట్రంలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కులాంతర వివాహం చేసుకోవడాన్ని గ్రామపెద్దలు సహించలేకపోయారు. గ్రామ కట్టుబాట్ల మేరకు ఆ యువతి కుటుంబ సభ్యులను గ్రామం నుంచి వెలివేస్తామని హెచ్చరించారు. దీనికి శిక్షగా యువతి కుటుంబానికి చెందిన 40 మందికి శిరోమండనం చేశారు. అలాగే, మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యంగా, పెళ్లి చేసుకున్న యువజంటకు పెద్దకర్మ కూడా కుటుంబ సభ్యులతో నిర్వహించడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఒరిస్సా రాష్ట్రంలోని కాశీపూర్ సమితి గోరఖ్‌పూర్ పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి అదే ప్రాంతానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన ఓ యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉంది. వీరిద్దరి కుటుంబానికి కుటుంబ పెద్దలు అంగీకరించలేదు. అయితే, మూడు రోజుల క్రితం ఆ జంట గ్రామం నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. గురువారం ఈ జంట తిరిగి గ్రామానికి తిరిగి వచ్చింది. ఈ విషయం గ్రామపెద్దలకు తెలియడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కులాంతర వివాహం చేసుకున్నారంటూ మండిపడుతూ, యువతి కుటుంబ సభ్యులను గ్రామం నుంచి వెలివేశారు. 
 
అదేసమయంలో గ్రామ బహిష్కరణ నుంచి బయటపడాలంటే గ్రామ కట్టుబాట్లను పాటించాలని ఆదేశించారు. ఇందులోభాగంగా, యువతి కుటుంబ సభ్యులు, బంధువుల్లోని పురుషులు శిరోమండనం చేసుకోవాలని, మూగ జీవాలను బలివ్వాలని, అలాగే, నూతన దంపతులకు పెద్దకర్మ చేయాలని తీర్పునిచ్చారు. 
 
గ్రామ పెద్దల ఆదేశాలు, హెచ్చరికలకు భయపడిపోయిన యువతి కుటుంబ సభ్యులు, వారి బంధువులు 40 మంది పురుషులు గుండు గీయించుకున్నారు. ఆ తర్వాత మేక, గొర్రె, కోడి, పావురాలను బలిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతికున్న తమ కుమార్తెకు పెద్దకర్మ కూడా నిర్వహించారు. ఈ అమానవీయ ఘటనపై పోలీసులు కిమ్మనకుండా ఉండిపోయారు. వారిని అడిగితే తమకు ఎలాంటి సమాచారం లేదని చేతులు దులుపుకున్నారు.