గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (15:52 IST)

శశికళకు అనుకూల పవనాలు.. ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయలేదట.. సుప్రీంలో పిల్.. పన్నీర్ సంగతేంటి?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు అనుకూల పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటివరకు తమిళనాడు సీఎం ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం గూటికి ఎమ్మెల్యేలు వచ్చి చేరుతున్నారనే వార్తలు కాస్త ఆయనకు ప్రశాంతత

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు అనుకూల పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటివరకు తమిళనాడు సీఎం ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం గూటికి ఎమ్మెల్యేలు వచ్చి చేరుతున్నారనే వార్తలు కాస్త ఆయనకు ప్రశాంతతను మిగిల్చాయి. కానీ గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఎమ్మెల్యేలున్నారని.. వారి ప్రాణాలకు అపాయం ఏర్పడిందని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసిన పన్నీరుకు చుక్కెదురైందనే చెప్పాలి.

పోలీసులు రెస్టార్ట్స్‌కు వెళ్లి ఎమ్మెల్యేల వద్ద విచారణ జరిపి సదరు నివేదికను మద్రాసు హైకోర్టుకు సమర్పించారు. ఈ నివేదికలో చిన్నమ్మ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయలేదని.. మేమై మేముగా రెసార్ట్‌కు వచ్చామని చెప్పారు. దీంతో కోర్టు తీర్పును వాయిదా వేసింది. 
 
మరోవైపు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వేగం పెంచారు. తన తరఫున సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయించారు. శశికళకు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతున్నా, ఆమెను గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదని, 24 గంటల్లోగా ఆమెను ఆహ్వానించేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. స్వయంగా శశికళ ఈ పిల్ దాఖలు చేయకపోయినా.. ఆమెకు మద్దతుగా ఇది దాఖలైనట్లు తెలుస్తోంది. 
 
24గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు శశికళను ఆహ్వానించేలా గవర్నర్‌ను ఆదేశించాలని న్యాయవాది పీఎల్‌ శర్మ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా శశికళను ఆహ్వానించడం లేదని ఆయన తన పిటిషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
అలాగే మద్రాసు హైకోర్టుకు పోలీసులు సమర్పించిన నివేదికలో 119 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగానే ఉన్నారని, వారినుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం 'నయవంచకుడు' అని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నిప్పులు చెరిగారు. ఇలాంటి పన్నీర్‌సెల్వంలను వేల మందిని తాను చూశానన్నారు. తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. 
 
పోయెస్ గార్డెన్ వెలుపల భారీగా హాజరైన తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి శశికళ మాట్లాడుతూ, పన్నీర్ సెల్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పన్నీర్ ఎప్పుడూ పార్టీకి విధేయుడుగా లేరని అన్నారు. పన్నీర్ ఆటలు ఇక సాగవని చెప్పారు. అసలు తనను సీఎంగా ఉండాలని ప్రతిపాదించినది కూడా పన్నీరేనని అన్నారు. అమ్మకు 33 ఏళ్ల పాటు తాను అండగా నిలబడ్డానని శశికళ గుర్తు చేశారు.